ఇళ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం

గ్రామస్తులతో మాట్లాడుతున్న లక్ష్మణ్‌కుమార్‌ - Sakshi

● డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెగడపల్లి(ధర్మపురి): డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అనర్హులకు కేటాయిస్తూ అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు. పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలో నిర్మించి, లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించారు. అసలైన నిరుపేదలను ఎంపిక చేయకుండా ఎంతోకొంత ఆర్థికంగా ఉన్నవారికి ఇళ్లను కేటాయించారని పలువురు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నందగిరిలో ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను కాంగ్రెస్‌ తరఫున కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల సూచన మేరకు అధికారులు నడుచుకోవడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. లింక్‌–2 కాల్వకు తూము నిర్మించి, నందగిరి బంజరు కుంటకు నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. అయితే ఈ తూము ద్వారా గ్రామంలోని వ్యవసాయ భూములకు పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి లేదన్నారు. ఇదే కాలువకు కొద్ది దూరంలో మరో తూము నిర్మించి, కుమ్మరికుంటకు నీరు చేర్చితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాంగ్రెస్‌ మండల శాఖ అధ్యక్షుడు రాములుగౌడ్‌, నాయకులు మల్లారెడ్డి, రాజు, సత్యనారాయణరెడ్డి, రవి, అశోక్‌రెడ్డి, గంగాధర్‌, రమేశ్‌గౌడ్‌, జితేందర్‌గౌడ్‌, తిరుపతి, రవి, లచ్చయ్య, రాజేశం, రాజేందర్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top