వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై బెదిరింపునకు పాల్పడ్డారంటూ ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు జేమ్స్ కోమీ గత ఏడాది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్టుతో సంబంధం ఉంది. ఆ పోస్టులో ఓ ఫొటో ఉంటుంది.
సముద్రం పక్కన గవ్వలతో “86 47” అంకెలను రాసి ఉన్న ఫొటో అది. ఈ మెసేజ్ను 47వ అధ్యక్షుడు ట్రంప్పై హింసకు పిలుపుగా విశ్లేషకులు భావించారు. ఇక 86 అనే అంకెను కొన్ని సందర్భాల్లో ‘‘తొలగించడం” లేదా “వెంటనే పంపివేయడం” అనే అర్థంలో వాడే స్లాంగ్ పదం.. ఈ పోస్టు చేసిన కొద్ది సేపటి తర్వాత కోమీ ఆ పోస్టును తొలగించారు. అది బెదిరింపు పోస్టుకాదని తెలిపారు. “కొంతమంది ఆ అంకెలను హింసతో కలిపి చూస్తారని నాకు తెలియదు” అని ఆయన చెప్పారు. అలాగే, తాను హింసకి వ్యతిరేకినని కూడా పేర్కొన్నారు.

జేమ్స్ కోమీపై ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు సంబంధించి ఇప్పుడు అధికారికంగా కేసు నమోదైంది. పోస్టు గత సంవత్సరం చేసినప్పటికీ దానిపై విచారణ తర్వాత ఇప్పుడు అభియోగాలు మోపడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియా పోస్టుతో సంబంధం ఉన్న కేసులో అమెరికా న్యాయ శాఖ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జేమ్స్ కోమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపిన ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మంగళవారం ముందుగా కోమీపై రెండోసారి అభియోగాలు మోపారు. గతంలో కోమీపై ఒక కేసు పెట్టారు. కానీ ఆ కేసు నిలవలేదు.. ఎందుకంటే కేసు వాదించిన న్యాయవాది (ప్రాసిక్యూటర్) నియామకంలో సమస్యలు ఉన్నాయి.
ఇప్పుడు అదే విషయంపై మళ్లీ కొత్తగా కేసు పెట్టారు. కాగా, 2017లో ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించిన తర్వాత ట్రంప్ను బహిరంగంగా విమర్శిస్తున్నారు కోమీ. ఆయన ఇన్స్టాలో చేసిన పోస్ట్ను ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులు బెదిరింపు మెసేజేనని అంటున్నారు.


