వాషింగ్టన్: జర్మనీ నుంచి 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి తీసుకురావాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాటో మిత్ర దేశానికి హెచ్చరికగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్తో అమెరికా జరపాల్సిన శాంతి చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాను ఇరాన్ ప్రభుత్వం అవమానానికి గురిచేసిందంటూ ఇటీవల జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు.
దీంతో ట్రంప్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ.. జర్మనీ నుంచి సైనికులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉపసంహరణ ప్రక్రియ వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తవుతుందని రాయిటర్స్ పత్రిక పేర్కొంది. మరోవైపు, ఇటలీ, స్పెయిన్లో కూడా తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు.
జర్మనీలో 36,436 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారిలో 5,000 మంది అమెరికాకు తిరిగి వచ్చేయనున్నారు. ఇక, ఇటలీలో 12,662 మంది, స్పెయిన్లో 3,814 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు.


