2025లో లాస్ ఏంజిల్స్లో సంభవించిన విషాదకరమైన పాలిసేడ్స్ అగ్నిప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఒక వ్యక్తి ప్రేమలో విఫలమవ్వడమేనని ఆ కోపంతోనే అతను పాలిసేడ్స్ ప్రాంతానికి నిప్పంటించారని దాని ద్వారా 12 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం..
జోనాథన్ రిండర్క్నెచ్ అనే 30 సంవత్సరాల ఒక ఉబెర్ డ్రైవర్ ప్రేమ విఫలమైంది. దీంతో న్యూ ఇయర్ (2025) వేడుకలకు తనతో పార్టీకి వెళ్లడానికి ఎవరూ తోడులేరు. దీంతో తీవ్ర నిరాశ చెందిన జోనాథన్ డిసెంబర్ 31, 2024 అర్థరాత్రి పాలిసేడ్స్ ప్రాంతంలో తన క్యాబులో ప్రయాణికులను దించాడు. అనంతరం కొండపైకి వెళ్లి తన వద్ద ఉన్న లైటర్తో ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ప్రమాదం అమెరికాలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి... దీని వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటల వల్ల 12 మంది మరణించగా వేలాది ఇళ్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు $ 65 బిలియన్ల (దాదాపు ₹5.4 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. నిందితుడు గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ను కాల్చి చంపిన 'లుయిగి మాంగియోన్' అనే వ్యక్తిని ఇతడు ఆరాధించేవాడని. "ధనవంతుల వద్ద మనం బానిసలుగా ఉన్నాం" అనే భావనతో, వారిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే ఇతనికి 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే జనవరి 1న చిన్న మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు మంటలను పూర్తిగా ఆర్పకుండా వదిలేయడం వల్లే ఆరు రోజుల తర్వాత అవి పెద్దవిగా మారాయని నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఇది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్షం అని తెలిపారు.


