అమెరికాకు కొత్త టెన్షన్‌.. ఇరాన్‌పై కీలక ఇంటెలిజెన్స్ నివేదిక | US Intelligence Report Iran Rebuilding Weapons Base Quickly Than Expected, Raising Fresh Concerns For US And Israel | Sakshi
Sakshi News home page

అమెరికాకు కొత్త టెన్షన్‌.. ఇరాన్‌పై కీలక ఇంటెలిజెన్స్ నివేదిక

May 22 2026 12:06 PM | Updated on May 22 2026 12:51 PM

US intelligence Report Iran Rebuilding Weapons Base Quickly

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడితో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. యుద్ధం కోసం అధునాతన టెక్నాలజీ ఉన్న బాంబు, క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించారు. దీంతో, ఇరువైపులా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ క్షీణించిన తన సైనిక సామర్థ్యాలను అంచనా వేసిన దాని కంటే చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు అమెరికాను టెన్షన్‌ పెడుతోంది.

అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌ తన సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దాని కంటే వేగంగా నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇరాన్ డ్రోన్ సామర్థ్యాలలో 50 శాతం ఇంకా మిగిలి ఉన్నాయి. యుద్ధ సమయంలో కోల్పోయిన ఆయుధాలను ఇరాన్‌ చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. నెల రోజుల క్రితం పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఏప్రిల్ 8న ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించింది. అయితే, అమెరికాతో కొనసాగుతున్న ఈ సంఘర్షణలో డ్రోన్లే ఇరాన్ యొక్క ప్రధాన ఆయుధం.

యుద్ధం సంఘర్షణలో దెబ్బతిన్న క్షిపణి స్థానాలు, ప్రయోగ పరికరాలు, మరియు కీలక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి శ్రేణులను మరమ్మత్తు చేయడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఇరాన్‌ ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ కోల్పోయిన సైనిక బలాన్ని పునరుద్ధరించుకుంటోందని నివేదిక పేర్కొంది. దీని అర్థం, ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్ ప్రాంతీయ మిత్రదేశాలకు మరోసారి ముప్పుగా మారగలదు. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్‌ల దాడి పరిధిలోనే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తీవ్రంగా క్షీణించడంతో, టెహ్రాన్ ప్రత్యామ్నాయంగా డ్రోన్ యుద్ధం వైపు ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. ఈ ముప్పును ప్రాంతీయ మిత్రదేశాలు ప్రత్యేక ఆందోళనతో చూస్తున్నాయి.

గతేడాది ఇజ్రాయెల్‌తో చేసిన 12 రోజుల యుద్ధం కంటే ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధంలోనే గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ ఎక్కువగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ విడుదల చేసిన గణాంకాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 మధ్య గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 550 దాటినట్లు తెలిసింది. తమపై జరిగిన క్షిపణి దాడులను, డ్రోన్ దాడులను ఒమన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై వేలాది బాంబులను వేశాయి.

ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఎక్కువ ఎత్తుకు చేరుకుని, అక్కడ నుంచి లక్ష్యాలను వెంబడించగలవు. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా ఈ బాలిస్టిక్ క్షిపణులను తెహ్రాన్ పరిగణిస్తోంది. తమ వైమానిక దళానికి ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తోంది. క్రూయిజ్, హైపర్‌సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో వెళ్తాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటికి ఎయిర్ పవర్ ఇంజిన్లు (జెట్ లేదా ప్రొపెల్లర్) సాయం అవసరం.

ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం..

  • ఇరాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణుల రేంజ్ 300 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లు.

  • ఈ క్షిపణులు గల్ఫ్ దేశాలు సహా పలు ఇతర సరిహద్దు దేశాలపై ప్రయోగించగలిగే సామర్థ్యంతో ఉన్నాయి.

  • మధ్యస్థ శ్రేణి క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించదగినవి. ఇవి ఇజ్రాయెల్‌ వరకు చేరుకోగలవు.

  • డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం ఇరాన్ వద్దనున్న 8 బాలిస్టిక్ క్షిపణుల రేంజ్..

  • షహాబ్ 1... 300 కిలోమీటర్లు

  • ఫతే 110... 300 నుంచి 500 కిలోమీటర్లు

  • షహాబ్ 2... 500 కిలోమీటర్లు

  • జుల్ఫిఖార్... 700 కిలోమీటర్లు

  • ఖియామ్ 1... 750 కిలోమీటర్లు

  • షహాబ్ 3... 2000 కిలోమీటర్లు


మరోవైపు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు దీర్ఘకాలంలో ఇరాన్ సైన్యాన్ని ఎంతగా దెబ్బతీశాయనే విషయాన్ని కూడా అమెరికా నిఘా వర్గాల అంచనాలు వేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. క్షిపణుల తయారీకి ఉపయోగించే విడిభాగాలను చైనా ఇరాన్‌కు సహాయం చేస్తోంది. అయితే అమెరికా దిగ్బంధనం కారణంగా ఆ సహాయం పరిమితం చేయబడింది. అలాగే, రష్యా నుంచి కూడా ఇరాన్‌ సాయం అందుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచే క్రమంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదిలోని సగం ఎయిర్‌డిఫెన్స్‌ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
యుద్ధ సమయంలో ఇరాన్‌పై అమెరికా 200కు పైగా థాడ్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్‌ మిసైల్‌-3, స్టాండర్డ్‌ మిసైల్‌-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్‌ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్‌ నిల్వలు సగానికి పడిపోయాయి.

అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్‌ ఇంటర్‌సెప్టర్‌లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్‌సెప్టర్‌లు, 90 డేవిడ్‌ స్లింగ్‌లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న యెమెన్‌, లెబనాన్‌ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. మొత్తం మీద ఇరాన్‌ తన సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అమెరికాకు కొత్త టెన్షన్‌ను తెచ్చిపెట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement