వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారు. అమెరికా $250 నోటుపై ట్రంప్ చిత్రం ముద్రించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో కరెన్సీ నోట్లపై జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని ముద్రించడాన్ని నిషేధించే నిబంధన ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనను మార్చే యత్నం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని కలిగిన 250 డాలర్ల నోటును జారీ చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభం చేసింది. ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే కొత్త నోటును ముద్రించడం ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఇదే ఆమోదం పొందితే 50 ఏళ్లకు పైగా కాలంలో అమెరికా నోటుపై కనిపించిన తొలి సజీవ వ్యక్తి ట్రంప్ అవుతారు.
2026లో యునైటెడ్ స్టేట్స్ తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ సాధించిన విజయాలను సూచిస్తూ ఈ నోటును జారీ చేస్తామని తెలిపారు. కాగా ఈ నోటు ప్రాథమిక డిజైన్ను చూసిన డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చూసి, దానికి కొన్ని మార్పులు సూచించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
160 ఏళ్ల చట్టం మార్చాలి
1866లో కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం, కేవలం మరణించిన ప్రముఖుల ఫోటోలను మాత్రమే డాలర్లపై ముద్రిస్తారు. జీవించి ఉన్న ఏ వ్యక్తి ఫోటోను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించకూడదు. ఒకవేళ అలా చేయాలంటే ఈ నిబంధనను ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. దీంతో ట్రంప్ ఫోటో వేయడానికి వీలుగా చట్టాన్ని సవరించాలంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ప్రతిపక్ష డెమొక్రాట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కాగా అమెరికా కరెన్సీ చరిత్రలో మొదటిసారిగా ఒక అధ్యక్షుడి పదవికాలంలోనే తన సంతకం నోట్లపై రాబోతోంది. $100 నోట్లతో పాటు ఇతర డాలర్ నోట్లపై డోనాల్డ్ ట్రంప్ సంతకాన్ని ముద్రించడానికి ట్రెజరీ శాఖ అనుమతించింది. ఈ నోట్ల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.


