వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం తన బ్లాకేడ్ను ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ‘హర్మూజ్ తెరిచి ఉంది.. కానీ ఇరాన్తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపాయి. ఇరాన్ సముద్ర మార్గం తెరవడం వల్ల చమురు ధరలు తగ్గి ఊరటనిచ్చినా, అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుండటం ఉద్రిక్తతలను తగ్గించలేకపోయింది. అమెరికా–ఇరాన్ చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు అణు అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్తో కలిసి భూగర్భంలో దాచిన యురేనియాన్ని తొలగించనున్నాం’అని చెప్పారు.
అంతకుముందు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 శాతం వరకు తగ్గాయి.


