థాయ్‌లాండ్‌ దాడులు | Thai Soldier Killed, Many Injured As New Clashes Break Out On Cambodia Border | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌ దాడులు

Dec 8 2025 8:57 AM | Updated on Dec 9 2025 6:31 AM

Thai Soldier Killed, Many Injured As New Clashes Break Out On Cambodia Border

నలుగురు కాంబోడియా పౌరులు మృతి

ప్రతిదాడిలో ఒక థాయ్‌లాండ్‌ జవాను మృతి

మళ్లీ ఇరుదేశాలపై కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

బ్యాంకాక్‌: మీరే మొదట కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే దక్షిణాసియా దేశాలు థాయ్‌లాండ్, కాంబోడియా మళ్లీ దాడుల్లో మునిగిపోయాయి. గత జూలైలో పరస్పర దాడులతో సరిహద్దు ప్రాంతవాసుల కంటి మీద కనుకులేకుండా చేసిన ఇరుదేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. యుద్ధానికి ఆజ్యం పోసేలా కాంబోడియా సరిహద్దు ప్రాంతాలపై థాయ్‌లాండ్‌ సోమవారం వైమానిక దాడులు చేసింది. 

ఈ ఘటనలో నలుగురు కాంబోడియా పౌరులు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరో 8 మంది గాయపడ్డారు. కాంబోడియా జరిపిన ప్రతిదాడిలో ఒక థాయ్‌లాండ్‌ జవాను చనిపోయాడు. దాడుల ధాటికి సరిహద్దు వెంట ఉన్న గ్రామాల నుంచి సోమవారం వేలాది మంది స్థానికులు బతుకుజీవుడా అంటూ తమ స్వస్థలాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. సరిహద్దు వెంట పలు గ్రామాల్లో ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించామని కాంబోడియా సమాచార శాఖ        మంత్రి నేథ్‌ ఫియాక్‌త్రా చెప్పారు. ‘‘ హింసను థాయ్‌లాండ్‌ ఎప్పుడూ కోరుకోదు. 

యుద్ధాన్నిగానీ సైనికచర్యనుగానీ థాయ్‌లాండ్‌ తనంతట తానుగా మొదలుపెట్టబోదు. కానీ దేశ ప్రజల భద్రతను పరిరక్షించేందుకు అవసరమైతే మరిన్ని దాడులు చేస్తాం. మా దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు’’ అని థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి అనుతిన్‌ చార్న్‌విరకూల్‌ చెప్పారు. ‘‘ మా దేశ సార్వభౌమత్వానికి ఇక ఎలాంటి ముప్పు లేదని తేలేదాకా దాడులు చేస్తూనే ఉంటాం’’ అని థాయ్‌లాండ్‌ విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. జూలైలో కాంబోడియా, థాయ్‌లాండ్‌ ఘర్షణల్లో 48 మంది చనిపోయారు. 3,00,000 మంది తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు తరలిపోయారు.

ఇది కూడా చదవండి: 600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement