ఆపరేషన్‌ సిందూర్‌.. తొలిసారి స్పందించిన పాక్‌ ప్రధాని | Pak PM Shehbaz Sharif Address to nation Over Operation Sindoor | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌.. తొలిసారి స్పందించిన పాక్‌ ప్రధాని

May 8 2025 7:26 AM | Updated on May 8 2025 7:26 AM

Pak PM Shehbaz Sharif Address to nation Over Operation Sindoor

ఇస్లామాబాద్‌: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉ‍గ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్‌..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్‌ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్‌ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్‌) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్‌ అజార్‌ సోదరి - ఆమె భర్త, మసూద్‌ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్‌ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.

మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్‌, పంజాబ్‌లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement