మళ్లీ ‘కోహినూర్’ పంచాయితీ.. మామ్దానీ సంచలన ప్రకటన | NYC Mayor Urges King Charles to Give it Back to India | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘కోహినూర్’ పంచాయితీ.. మామ్దానీ సంచలన ప్రకటన

Apr 30 2026 8:15 AM | Updated on Apr 30 2026 8:16 AM

NYC Mayor Urges King Charles to Give it Back to India

న్యూయార్క్‌: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రం ‘కోహినూర్’ను తిరిగి భారతదేశానికి అప్పగించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కు ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. 9/11 స్మారక చిహ్నం వద్ద రాజును కలిసే ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామంతో దశాబ్దాల నాటి కోహినూర్ వివాదం మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏకాంతంగా కలిస్తే అదే అడుగుతా!
కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాలతో న్యూయార్క్ మేయర్ మామ్దానీ భేటీకి ముందు కోహినూర్ ప్రస్తావన అధికారిక అజెండాలో లేదు. అయితే, రాజుతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని తాను గౌరవపూర్వకంగా కోరుతానని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత 9/11 స్మారక కేంద్రం వద్ద రాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేసుకున్నప్పటికీ, వారి సంభాషణ చాలా తక్కువ సమయం జరిగింది. ఆ కొద్ది క్షణాల్లో కోహినూర్ ప్రస్తావన వచ్చిందా లేదా అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

చేతులు మారిన వజ్రం.. చరిత్ర ఏం చెబుతోంది?
కోహినూర్ వజ్రానికి వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు పాలకుల చేతులు మారుతూ వచ్చిన ఈ అమూల్యమైన రత్నం.. 1849లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. లాహోర్ ఒప్పందం ద్వారా అప్పటి యువ పాలకుడు మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటీషర్లు దీనిని బలవంతంగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్‌లో బ్రిటీష్ క్రౌన్ జ్యువెల్స్ (రాజ కుటుంబపు ఆభరణాల)లో ప్రదర్శనలో ఉంది.

దశాబ్దాల వివాదం.. భారత్ నిరంతర పోరాటం
వలస పాలనలో అన్యాయంగా తరలించిన తమ వజ్రాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని భారతదేశం పదేపదే డిమాండ్ చేస్తోంది. భారతీయుల దృష్టిలో కోహినూర్ అనేది ఒక చరిత్రక అన్యాయానికి ఒక సజీవ సాక్ష్యం. కానీ యునైటెడ్ కింగ్‌డమ్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగానే తాము ఈ వజ్రాన్ని పొందామని, దానిపై పూర్తి హక్కులు తమవేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. భారతీయ మూలాలున్న మేయర్ మామ్దానీ తాజా వ్యాఖ్యలతో ఈ పాత వివాదం ఇప్పుడు మళ్లీ రాజుకుంది.

ఇది కూడా చదవండి: బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ!

Advertisement
 
Advertisement
Advertisement