ఐక్యరాజ్యసమితి: లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్లో భారత శాంతి పరిరక్షక దళం తరఫున సేవలందిస్తున్న మేజర్ అభిలాష బారక్ ప్రతిష్టాత్మక మిలటరీ జెండర్ అడ్వొకేట్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా మహిళలు, బాలికలకు చేరువయ్యేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐరాస శుక్రవారం ఎక్స్లో తెలిపింది.
యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్(యూనిఫిల్)లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్గా బారక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీలో కంబాట్ హెలికాప్టర్ పైలట్గా ఎంపికైన మొట్టమొదటి మహిళ అభిలాష బారక్. ఈ నెల 29వ తేదీన ఐరాస శాంతిపరిరక్షక దళాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అభిలాషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును గతంలో ఐరాస శాంతిపరిరక్షక దళాల్లో పనిచేసిన భారత్కు చెందిన మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ తమ సేవలకు గుర్తింపుగా అందుకోవడం విశేషం.


