భూకంప ప్రభావం అంతరిక్షంలో!!  | Japanese scientists reveal how earthquakes can disrupt satellites in space | Sakshi
Sakshi News home page

భూకంప ప్రభావం అంతరిక్షంలో!! 

Jun 3 2025 5:03 AM | Updated on Jun 3 2025 5:03 AM

Japanese scientists reveal how earthquakes can disrupt satellites in space

అవని కుదుపులతో శాటిలైట్‌ కమ్యూనికేషన్లకు అంతరాయం 

భవిష్యత్‌ శాస్త్రీయ ప్రయోగాలకు అవరోధం!

కొత్త విషయాలను వెల్లడిస్తున్న జపాన్‌ శాస్త్రవేత్తల నూతన అధ్యయనం

పట్టాలపై రైలు పరుగులు తీస్తుంటే.. హఠాత్తుగా ముందున్న ఇంజిన్‌ కాస్తంత నెమ్మదించినా వెనకాలే క్యూ కట్టిన బోగీలన్నీ టపటపా ఢీకొన్నంత పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి బోగీ పక్క బోగీతో అనుసంధానమై ఉంటుంది. కానీ ఎలాంటి అనుసంధానంలేని సుదూర శాటిలైట్లు సైతం భూకంపం వేళ ప్రభావితం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. భూకంపం ధాటికి భూకంపకేంద్ర సమీప భవనాలు, భవంతులు పేకమేడల్లా కదలిపోవడం చూస్తుంటాం.

 కానీ ఆకాశంలో ఉండే కృత్రిమ ఉపగ్రహాల పనితీరు సైతం భూకంపాల తీవ్రతకు లోనవుతోందని తాజా పరిశోధనలో తేలింది. భౌతికంగా భూమితో అనుసంధానంకాని ఉపగ్రహాలకు భూకంప పర్యవసానాలకు మధ్య గల సంబంధాన్ని తొలిసారిగా ఈ పరిశోధన ఆవిష్కరించింది. జపాన్‌లోని నగోయా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘ఎర్త్, ప్లానెట్స్, స్పేస్‌’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  

భూతలం సహా గగనతలం.. 
రెండు భూఫలకాల కొనల వద్ద రాపిడి, ఢీకొనే సందర్భాల్లో భూకంపం సంభవిస్తుంది. ఇవి భూతల వనరులనే కాదు గగనతల కృత్రిమ వనరులైన శాటిలైట్లనూ ప్రభావితం చేస్తాయని అధ్యయనకారుల్లో అనుమానం మొదలైంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేసుకునేందుకు గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(జీఎన్‌ఎస్‌ఎస్‌)లోని 4,500కుపైగా రిసీవర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుని ఆ డేటాతో త్రిమితీయ(3డీ) ‘‘వాతావరణ ఇబ్బందుల’’ముఖచిత్రాన్ని రూపొందించారు.

 2024 జనవరి ఒకటో తేదీన జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్ఛర్‌లోని నోటో ద్వీపకల్పంలో రిక్టార్‌ స్కేల్‌పై 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. అప్పుడు ఆకాశంలోకి సంక్లిష్టమైన ధ్వని తరంగాలు దూసుకెళ్లాయి. ఇవి భూమి నుంచి ఆకాశంలో 60 నుంచి 1,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అయనో ఆవరణం(ఐనోస్ఫియర్‌)లోకి వెళ్లాయి.

 అక్కడి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లతో నిండిన వాయువులను ఈ ధ్వనితరంగాలు విపరీతంగా ప్రేరేపించాయి. దాంతో ఈ వాయువులు కింద పొర అయిన థర్మోస్ఫియర్‌ వాతావరణంలోకి కొంత శక్తిని విడుదలచేశాయి. అప్పటికే థర్మోస్పియర్‌ ఆవరణలో స్థిరంగా ఉన్న శాటిలైట్లపై ఈ అదనపు శక్తి ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో శాటిలైట్ల నుంచి భూమి మీదకు జరగాల్సిన కమ్యూనికేషన్‌ సిగ్నళ్ల ప్రసరణ వేగంలో మార్పులు కనిపించాయి. 

సిగ్నళ్లు ఆలస్యంగా రావడంతోపాటు సిగ్నళ్లలో సాంద్రత సైతం తగ్గిపోయినట్లు గుర్తించారు. టోమోగ్రఫీ సాయంతో వైద్యరంగంలో వాడే సీటీ స్కాన్‌ తరహాలో వేర్వేరు కోణాల్లో శాటిలైట్ల డేటాను క్రోడీకరించి 3డీ చిత్రాలను రూపొందించారు. భూకంపం సంభవించినప్పుడు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ధ్వని తరంగాలు ఐనోఆవరణను చేరిపోతున్నాయి.

 ప్రశాంత కొలనులో రాయి విసిరితే ఏర్పడే వలయాకార అలల్లా ధ్వని తరంగాలు ఐనోస్ఫియర్‌లోకి వెళ్తున్నాయి. భూకంపం సంభవించినప్పుడు భూఫలకాలు ఢీకొన్న ఒక్క ప్రాంతంలోనే ధ్వని తరంగాలు ఉధ్భవిస్తాయని గతంలో భావించారు. అలాకాకుండా నోటో ద్వీపకల్ప ఘటనలో 150 కిలోమీటర్ల పొడవునా రెండు భూఫలకాలు ఢీకొన్న చోట్ల నుంచి ధ్వనితరంగాలు పుట్టుకొచ్చాయని, ఇలాంటి సందర్భాల్లోనే అధిక తరంగాలు ఉద్భవిస్తున్నాయని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత డాక్టర్‌ వెజియాంగ్‌ ఫూ చెప్పారు.  

పలు సమస్యలు.. 
ధర్మోస్ఫియర్‌పై అదనపు ఒత్తిడితో శాటిలైట్ల నుంచి ప్రసారాల నాణ్యత తగ్గిపోవడంతో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌), శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూకంపాలతో ఉపగ్రహాల పనితీరూ దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమైందని మరో రచయిత, ప్రొఫెసర్‌ యుచీ ఒట్సుకీ చెప్పారు. భూకంపాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత పటిష్టచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యుచీ అభిప్రాయపడ్డారు. భూకంపాలతోపాటు సునామీ, అగి్నపర్వతాల విస్ఫోటం వంటి అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితులకూ తమ అధ్యయన మోడళ్లను అన్వయించి మరింత విస్తృతస్థాయి అవగాహనకు ప్రయతి్నస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement