టెహ్రాన్: ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచే ఈ దాడులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సైన్యం ఏప్రిల్ 1 నుంచి వెస్ట్ ఆసియా ప్రాంతంలో అమెరికా కంపెనీలే లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించాయి. ఐఆర్జీసీ ప్రకటించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
అమెరికా దాడులకు ప్రతీకారంగా సైనిక స్థావరాలకే కాకుండా వాణిజ్య, సాంకేతిక రంగ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ చర్యలు ఏప్రిల్ 1, బుధవారం రాత్రి 8 గంటలకు (టెహ్రాన్ సమయం) ప్రారంభమవుతాయని హెచ్చరించింది. ‘ప్రతి ఉగ్రదాడికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము’ అని ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు జరుపుతోంది. ఈ చర్యలు అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా జరుగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈసారి సాంకేతిక, వాణిజ్య రంగ సంస్థలను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకోవడంతో యుద్దం మరింత ఉద్రిక్తమయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


