ఇరాన్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రంప్ విధించిన డెడ్లైన్కి మరికొన్ని గంటలే మిగిలుంది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ ఐఆర్జీసీ(IRGC) చీఫ్ మజీద్ ఖదేమీ మృతి చెందారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా మజీద్ మరణాన్ని ధృవీకరించింది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు.. ఇరాన్లోని కీలక పెట్రోకెమికల్ మౌలిక వసతులపై భారీ దాడి నిర్వహించినట్లు ప్రకటించాయి. దక్షిణ ఇరాన్లోని అసలూయెహ్లోని ప్రాంతంలోని అతిపెద్ద పెట్రోకెమికల్ సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు.
ఈ సముదాయం రసాయన పదార్థాల ఉత్పత్తి, ఎగుమతులకు కీలక కేంద్రంగా ఉంది. ఇరాన్ సైనిక అవసరాలకు ఉపయోగపడే పేలుడు పదార్థాలు, బాలిస్టిక్ క్షిపణుల తయారీలో ఉపయోగించే పదార్థాలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయని ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ దళాలు) పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్లోని రెండు అతిపెద్ద పెట్రో కెమికల్ సముదాయాలపై దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ దాడులతో ఇరాన్ పెట్రోకెమికల్ ఎగుమతి సామర్థ్యంలో 85 శాతం పైగా దెబ్బతిన్నట్లు పేర్కొంది.
అసలూయెహ్లోని ఈ కేంద్రంలో క్షిపణుల తయారీకి అవసరమైన ముఖ్య రసాయనాల ఉత్పత్తి జరుగుతుండటంతో.. ఇరాన్ ఆయుధ తయారీ సామర్థ్యంపై ఈ దాడి, తీవ్ర ప్రభావం చూపుతుందని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించే ఆయుధాల తయారీని అడ్డుకోవడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక తయారీ సామర్థ్యాన్ని బలహీనపరచడం కోసం ఇలాంటి దాడులు కొనసాగుతాయని కూడా హెచ్చరించింది.


