ట్రంప్ 48 గంటల అల్టిమేటం వేళ ఇరాన్ భారీ ఝలక్ ఇచ్చింది. తమ దేశం ఎట్టి పరిస్తితుల్లో వెనుకంజ వేయదని తేల్చిచెప్పింది. బెదిరింపులతో చర్చలు జరగవని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగేయ్ కుండ బద్ధలు కొట్టారు. తమ దేశాన్ని పూర్తి స్థాయిలో రక్షించుకుంటామన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే టెహ్రాన్ని నాశనం చేస్తామన్నారు. ఈ మేరకు చర్చల చేసుకోవాలని డెడ్లైన్ సైతం విధించారు. బెదిరింపులను ఇరాన్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగేయ్ ఘాటుగా బదులిచ్చారు.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఎంత మాత్రం గౌరవించడం లేదని ఇస్మాయిల్ బగేయ్ అన్నారు. ఆ దేశాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని వాటికి హద్దులే లేవని దుయ్యబట్టారు.
వాషింగ్టన్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను బగేయ్ తిరస్కరించారు."ఇరాన్ తన న్యాయబద్ధమైన డిమాండ్లను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏమాత్రం వెనుకాడదు.ఇలా చేయడాన్ని రాజీ పడటంగా భావించకూడదు, బదులుగా తన వాదనలను రక్షించుకోవడంలో ఇరాన్కు ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబంగా దీనిని చూడాలి" అని బఘాయ్ అన్నారు.
ఒకవేళ ఒప్పందం అంటూ జరిగితే అది దేశభద్రతా, ప్రయోజనాల ఆధారంగానే ఉండాలి తప్ప బెదిరింపులకు లొంగి చర్చల్లో పాల్గొనేది లేదనిస్పష్టం చేశారు. ప్రస్తుతం మా దృష్టంతా దేశాన్ని రక్షించడంపైనే అని తెలిపారు. అదే విధంగా తమ దేశ ప్రయోజనాల ఆధారంగా తమ డిమాండ్లను వివరిస్తూ, మధ్యవర్తులకు అందించాల్సిన లిఖితపూర్వక ప్రతిస్పందనను సిద్ధం చేశామని ఈ విషయాన్ని అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తామని బఘాయీ పేర్కొన్నారు.
అదేవిధంగా తమ దేశంపై జరిగే దాడులకు అదే రీతిన తగిన బధులిస్తామని హెచ్చరించారు. కాగా అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్ దృక్పథం తెలియజేశారు. బ్రిడ్జిలు కూలిపోతే మళ్లీ నిర్మించవచ్చు, కానీ అమెరికాకు బుద్ధి చెప్పే అవకాశం మళ్ళీ రాదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ రుద్దిన యుద్ధానికి శాశ్వత ముగింపు టెహ్రాన్ కోరుకుంటోందని తెలిపారు.


