వరుసగా ఎయిరిండియా విమానాల్లో చోటుచేసుకుంటోన్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రెండు ఎయిరిండియా విమానాలకు భారీ ప్రమాదం తప్పింది. తొలుత ఢిల్లీ నుంచి వచ్చిన విమానం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా దాని తోక భాగం రన్వేను బలంగా తాకింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు.
అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తున్న మరో ఎయిరిండియా విమానం గురువారం సాయంత్రం ఢిల్లీఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం రన్వేకు సమీపిస్తున్న సమయంలో, ఒక ఇంజిన్లో మంటలు వచ్చినట్లు కాక్పిట్ సిబ్బందికి అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ సిగ్నల్ను క్రాస్ చెక్ చేసుకోగా, ఇంజిన్లో మంటలు రావడం నిజమేనని నిర్ధారణ అయింది.
పైలట్లు వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. తక్షణమే అత్యవసర నియమావళిని (SOP) అమలు చేస్తూ విమానాన్ని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఆగిన తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.


