ఎండలు ముందే ముగిశాయెందుకు? | Earth average temperature for 2025-29 likely to exceed 1. 5c limit | Sakshi
Sakshi News home page

ఎండలు ముందే ముగిశాయెందుకు?

Jun 3 2025 4:46 AM | Updated on Jun 3 2025 4:46 AM

Earth average temperature for 2025-29 likely to exceed 1. 5c limit

గత ఏడాది మే, జూన్‌ నెలల్లో భగభగలు.. ఈసారేమో చల్లదనం

దేశవ్యాప్తంగా చాలాచోట్ల వర్షాలు

వాతావరణ మార్పులే కారణం

మే నెల భానుడి ప్రచండ వేడికి పెట్టింది పేరు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయని పెద్దల మాట. సూర్యప్రకోపానికి జనం విలవిల్లాడిపోయే కాలంగా ఎండాకాలం దశాబ్దాలుగా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి మే నెలలో దాదాపు వేడి మాయమై చల్లదనమే రాజ్యమేలింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పైగా ముందస్తుగానే ఎండాకాలం జనాలకు బైబై చెప్పి వెళ్లిపోయింది. 

2024లో మే, జూన్‌ నెలల్లో ఎండలు విపరీతంగా ఉండటంతో 2025లో ఆదిత్యుడు ఇంకెంత రెచ్చిపోతాడోనన్న భయాలను పటాపంచలు చేస్తూ ఈసారి మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవడం విశేషం. తక్కువ ఎండలకు తోడు తక్కువ రోజులే ఎండాకాలం కొనసాగడం గమనార్హం. వేడిమి, ఉక్కబోతతో విసుగుతెప్పించే వేసవికాలం వేగంగా గడిచిపోయింది.

 2024 సంవత్సరం భూమి మీద అత్యంత ఉష్ణమయ ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక భారత్‌లో గత ఏడాది మేలో దేశవ్యాప్తంగా వడగాలులు చండ ప్రచండంగా వ్యాపించి జనాన్ని బెంబేలెత్తించాయి. ఇందుకు పూర్తి భిన్నంగా 2025 మేనెల సాగిపోవడం సాధారణ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో, ఒకింత ఆలోచనలో పడేసింది. ఈసారి దేశ వాతావరణ ముఖచిత్రంలో మార్పులొచ్చాయని కొందరు విశ్లేషణలు మొదలెట్టారు. 

2024 మే, జూన్‌లో..
గత ఏడాది మే, జూన్‌ నెలల్లో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు వడగాల్పుల ఘటనలు చాలా చోట్ల సంభవించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కరువు తాండవించింది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. భూగర్భజలాలు మరింత కిందకు వెళ్లిపోయాయి. విద్యుత్‌ కొరత సమస్య సైతం అధికమైంది. 

వాతావరణ మార్పులతో ముడిపడిన ఈ అధిక ఉష్ణోగ్రతల విపరిణామాలు వెనువెంటనే వ్యవసాయం, ఆరోగ్యంతోపాటు కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవనంపైనా దుష్ప్రభావాలు చూపాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. 2025 మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాకుండా అకాలవర్షాలు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. వాతావరణ చక్రంలో మార్పుల కారణంగానే మేలో వేడిమి మటుమాయమై చల్లదనం వచ్చి చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చల్లదనం అత్యధిక రోజులు కొనసాగడంతో అది అంతిమంగా ఎండకాలం ముగింపునకు ముందస్తు నాంది పలికిందని నిపుణులు విశ్లేషించారు. 

మరెన్నో కారణాలు..
వర్షాకాలం ఈసారి ముందస్తుగా ముంచుకురావడం సైతం ఎండకాలం తీవ్రతను తగ్గించేసింది. వాతావరణంలో ముందస్తుగా తేమ శాతం పెరగడం, చల్లని గాలుల క్రమానుగతిలో మార్పులు సైతం  ఉష్ణోగ్రత అధికం కాకుండా అడ్డుకున్నాయి. దీంతో వేసవికాలంలో వేడి తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎండాకాలంలో వాతావరణం చాలావరకు మేఘావృతమైంది. దాంతోపాటు దేశంలో మేనెలలో ప్రతిరోజూ ఏదోఒక చోట వర్షాలు పడుతూ సగటు ఉష్ణోగ్రత పెరగకుండా నిలువరించాయి. ఈ చల్లదన పరిస్థితులు పరోక్షంగా ప్రభుత్వాల మీదా పెనుభారాన్ని ఒక్కసారిగా దించేశాయి. విద్యుత్‌ డిమాండ్‌ పెరగకుండా అడ్డుకున్నాయి.

ముందుకొచ్చిన కొత్త ధోరణి
ఉడికించే ఉష్ణోగ్రతలు ఉన్నపళంగా తగ్గిపోవడం కొన్ని రకాల పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కటి వేడి పరిస్థితుల్లోనే కొన్నిరకాల పంటలు ఏపుగా పెరిగే పరిస్థితులు ఉంటాయని, ఈసారి ఎండలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆయా పంటల సాగుఫలంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈసారి మారిన ఈ పరిస్థితులకు తగ్గట్లు కర్షకులు తమ పంటల విత్తునాటడం మొదలు ఎరువులు, పురుగుమందులు చల్లడం దాకా ప్రతిదాంట్లో కాస్తంత సమయపాలన పాటించడం తప్పనిసరి అయిందని వాళ్లు చెబుతున్నారు. హఠాత్తుగా ఎండాకాలం వ్యవధి తగ్గి వర్షాలు మొదలవడంపై వాతావరణ విభాగం సైతం వాతావరణ ముందస్తు అంచనాల వ్యూహాలకు పదునుపెట్టింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement