China: 70 Percent Population of Shanghai Infected Covid Claims Expert - Sakshi
Sakshi News home page

Coronavirus In China: ఆ నగరంలో 70% మందికి కోవిడ్‌!

Jan 3 2023 8:34 PM | Updated on Jan 3 2023 8:57 PM

China: 70 Persent Population of Shanghai Infected Covid Claims Expert - Sakshi

కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మహమ్మారి విలయతాండం చేస్తోంది. డిసెంబర్‌లో జీరో కోవిడ్‌ పాలసీని ఎత్తేవేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు మరణాలు కూడా భారీ స్థాయిలో సంభవిస్తున్నట్లు తెలుస్తోంది.  దీనికి తోడు కరోనా లెక్కలు బయటకు చెప్పకపోవడంతో డ్రాగన్‌ దేశంలో పరిస్థితి ఊహలకు అందకుండా మారింది. లండన్‌కు చెందిన ఎనలిటిక్స్ సంస్థ ఎయిర్‌ఫినిటీ నివేదిక ప్రకారం డిసెంబర్ మొదటి 20 రోజుల్లో చైనాలో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. 

తాజాగా చైనాలోని షాంఘై నగరంలోని జనాభాలో దాదాపు 70 శాతం మందికి పైగా ఇప్పటికే కోవిడ్ సోకి ఉంటుంద‌ని సీనియ‌ర్ వైద్యులు పేర్కొన్నారు. షాంఘైలోని హాస్పిట‌ళ్లు కోవిడ్ రోగుల‌తో నిండిపోతున్నాయని తెలిపారు. రుయిజిన్ హాస్పిట‌ల్ వైస్ ప్రెసిడెంట్‌, షాంఘై కోవిడ్ అడ్వైజ‌రీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జ‌న్ దీనిపై మాట్లాడుతూ.. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో.. చాలా మందికి వైర‌స్ సోకి ఉంటుంద‌న్నారు. ఈ న‌గ‌రంలో ప్ర‌స్తుతం వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంద‌ని, జ‌నాభాలో 70 శాతం మందికి కోవిడ్‌ సోకి ఉంటుంద‌ని తెలిపారు.

గ‌త ఏప్రిల్‌, మే నెల‌ల‌తో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంద‌న్నారు. రుయిజిన్ హాస్పిట‌ల్‌లో ప్ర‌తి రోజు 1600 ఎమ‌ర్జెన్సీ అడ్మిష‌న్లు జ‌రుగుతున్నాయని, అందులో 80 శాతం కోవిడ్‌ కేసులేనని పేర్కొన్నారు.చెప్ర‌తి రోజు హాస్పిట‌ల్‌కు వంద అంబులెన్సులు వ‌స్తున్న‌ట్లు చెన్ ఎర్జ‌న్ తెలిపారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమ‌ర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్న‌ట్లు చెప్పారు. కాగా బీజింగ్‌, తియాంజిన్‌, చాంగ్‌కింగ్‌, గాంగ్‌జూ లాంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. అంతేగాక  ఈ ఏడాది ఆరంభంలో కరోనా  ఇన్‌ఫెక్ష‌న్లు అధికంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌తోపాటు అమెరికా, దక్షిణ కొరియా,  ఇటలీ, యూకే, ఫ్రాన్స్, జపాన్ తైవాన్‌ వంటి పలు దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి కోవిడ్ పరీక్షలను విధించాయి.అయితే చైనా ప్రయాణికులపై ఇతర దేశాలు విధించిన ఆంక్షలను బీజింగ్ తీవ్రంగా స్పందించింది.  దీనికి ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చదవండి: చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement