
ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించడంతో యువత నుంచి నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో 20 మంది మరణించగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.
సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ‘జనరేషన్ జెడ్’నిరసనలు చోటుచేసుకున్న దరిమిలా హోంమంత్రి రమేష్ లేఖక్ నైతిక కారణాలతో రాజీనామా చేశారు. ఈ నిరసనలపై స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ హింసకు అవాంఛనీయ శక్తుల చొరబాటే కారణమని ఆరోపించారు. కాగా ఈ నిరసనలకు స్వచ్ఛంద సంస్థ ‘హామీ నేపాల్’ అధ్యక్షుడు సుడాన్ గురుంగ్(36) సారధ్యం వహించాడని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో గురుంగ్.. సోషల్ మీడియా యాప్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలకు పిలుపు నిచ్చాడని సమాచారం.
2015లో నేపాల్లో సంభవించిన భూకంపంలో సుడాన్ గురుంగ్ తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటన దరిమిలా సుడాన్ సమాజంలోని సమస్యలపై ఉద్యమాలను చేపడుతూ వస్తున్నాడు. ఒకప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్న ఆయన విపత్తు ఉపశమన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సుడాన్ పిలుపు మేరకు వేలాది మంది యువ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పార్లమెంటు వెలుపల భారీ ర్యాలీని నిర్వహించారు. సోషల్ మీడియా సైట్లపై ప్రభుత్వ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్, లైవ్ రౌండ్లను కూడా ప్రయోగించారు.