జుబా: దక్షిణ సూడాన్లో బంగారు గని విషయమై తలెత్తిన వివాదం 70కి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. సెంట్రల్ ఈక్విటోరియా ప్రావిన్స్లోని దేశ రాజధాని జుబా నగర శివారులోని బంగారు గని వద్ద శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. జెబెల్ ఇరాక్లోని బంగారు గనిలో తవ్వకాలపై మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని సాయుధులు గని వద్ద ఉన్న వారిపై మూకుమ్మడిగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రాంతం ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉందని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని ప్రతిపక్ష సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మి(ఎస్పీఎల్ఎం) ఆరోపించింది.


