బెర్గామో ప్రావిన్స్: ఇటలీలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు భారతీయుల మృతి చెందారు. బెర్గామో ప్రావిన్స్లోని కోవో ప్రాంతంలో వైశాఖీ పండుగ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రార్థనా స్థలం(గురుద్వారా) నుండి బయటకు వస్తుండగా ఇద్దరు భారతీయ వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రికి ఈ ఘటన చోటుచేసుకుంది.
పారిశ్రామిక ప్రాంతంలోని గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ ముందున్న చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతులను కోవో నివాసి రగిందర్ సింగ్ (48), అగ్నాడెల్లోకు చెందిన గుర్మిత్ సింగ్ (48)గా గుర్తించారు. సంఘటనా స్థలంలో సుమారు 10 బుల్లెట్ కేసింగ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ ఈ కాల్పులకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారతీయుడేనని అతను కూడా తరచుగా ఆ గురుద్వారాకు వస్తుంటాడని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ కాల్పుల్లో మరో మూడో వ్యక్తికి కూడా బుల్లెట్లు తగిలి గాయపడినట్లు సమాచారం.


