● ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పరీక్షల్లో విజయ కేతనం
● ఎప్సెట్లో హైదరాబాద్కు ర్యాంకుల పంట
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఎంసెట్ (టీజీ ఎప్సెట్)–2026 ఫలితాల్లో మహా హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులను కొల్లగొట్టి ‘మహా నగరం’ విద్యా హబ్గా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. పట్టుదల, ప్రణాళికాబద్ధమైన కృషితో విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు.
● ఇంజనీరింగ్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర స్థాయి మొదటి (ఫస్ట్) ర్యాంక్తో పాటు టాప్–10లో వరుసగా 2, 6, 7, 8, 9, 10 ర్యాంకులను కై వసం చేసుకుని జైత్రయాత్ర సాగించారు.
● అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లోనూ అదే జోరును కొనసాగించారు. రాష్ట్ర స్థాయి రెండో (సెకండ్) ర్యాంక్ను సొంతం చేసుకోవడంతో పాటు, వరుసగా 3, 4, 5, 10 స్థానాలను దక్కించుకుని టాప్గా నిలిచారు. ఫలితాల్లో టాప్–10లో మెజారిటీ ర్యాంకులు గ్రేటర్కే దక్కడం విశేషం.
మురిపించిన ఫలితాలు
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఈ ఏడాది భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరై, అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో మూడు జిల్లాల నుంచి దాదాపు 1.15 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో సుమారు 98వేల మందికిపైగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో గ్రేటర్ పరిధి నుంచి సుమారు 48వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41వేల మందికిపైగా అర్హత సాధించి ఉన్నత చదువుల రేసులో నిలిచారు.


