ఐటీ కారిడార్లో ట్రాఫిక్కు కారణం వీరే
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐటీ హబ్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్లో చేపట్టిన ఈ సర్వేలో పలు వాస్తవాలు వెల్లడయ్యాయి.
అనర్థాలెన్నో..
కేవలం గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్ రైడర్లు (వాహనంలో ఒక్కరే ప్రయాణించేవారు) ప్రయాణించగా, డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. డబుల్ రైడర్ల కంటే సింగిల్ రైడర్లు 6,554 అధికంగా ఉండటంతో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగి తీవ్రమైన ట్రాఫిక్ జామ్లకు దారితీస్తోంది. సమయం వృథా కావడంతో పాటు అదనపు ఇంధన ఖర్చులు, ప్రమాదాల రిస్క్, శారీరక అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసీ.. అధిక శాతం మంది ఒంటరిగా ప్రయాణించడానికే మొగ్గు చూపడం ఆశ్చర్యకరమని, ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, పౌరులు తమ ప్రయాణాల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే.. ట్రాఫిక్ రహిత సైబరాబాద్ను నిర్మించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలీసుల ముఖ్య సూచనలివీ
● సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్ పద్ధతిని పాటించాలి
● సహోద్యోగులు లేదా స్నేహితులతో కలిసి కార్ పూలింగ్ చేయాలి.
● పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని పెంచాలి.
● పీక్ అవర్స్లో అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలి.
● పాఠశాల, కళాశాల వాహనాలు నడిచే రద్దీ సమయాల్లో ప్రయాణించకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి.
గంటలో 10,138 వాహనాలపై సింగిల్ రైడర్లు
డబుల్ రైడర్లవి 3,584
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్వేలో వెల్లడి


