● 13న రెండోమ్యాచ్ నుంచి అందుబాటు
● భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా
ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్లకు 2 వేల మందిపైగా బలగాలు, 430 సీసీ కెమెరాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ కె.సురేష్కుమార్ తెలిపారు. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్, సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశమై నిబంధనలను వివరించినట్లు పేర్కొన్నారు. డీసీపీ (ట్రాఫిక్) శ్రీనివాసులు, హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజ్, ట్రెజరర్ డా.అనిల్కుమార్తో కలిసి స్టేడియంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండోమ్యాచ్ (ఏప్రిల్ 13) నుంచి డిజిటల్ టికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఒకరు 4 టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. 5 అంబులెన్స్లు, 4 ఫైరింజన్లను సిద్ధం చేశామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు. మహిళల భద్రతకు షీ టీంలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. బ్లాక్లో టికెట్ల అమ్మకం, బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మ్యాచ్ తేదీల్లో మెట్రో రైల్, అర్టీసీ సర్వీసుల సమయాలను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాలరీలో ప్రతి సీటుకు నంబరు వేసినట్లు హెచ్సీఏ అధికారులు తెలిపారు. కాగా, ప్రతి సీట్కు నంబర్, రెండో మ్యాచ్ నుంచి డిజిటల్ టికెట్లు ఈసారి ప్రత్యేకత. గతంలో 2,800 మంది పోలీస్లను కేటాయించగా, ఈసారి 2 వేలకు కుదించారు. 360 సీసీ కెమెరాల సంఖ్యను 430కు పెంచారు. మ్యాచ్ తేదీల్లో ఉప్పల్, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు.


