
ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఇష్టారాజ్యం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ౖఫెర్సేఫ్టీ సహా అనుమతి లేని ఇరుకైన భవనాల్లో ఏర్పాటు చేసిన పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగుల సేవలో తరించాల్సిన కొంత మంది వైద్యాధికారులు ఆస్పత్రుల తనిఖీల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లకు అనుమతుల జారీ సహా పాత ఆస్పత్రులకు లైసెన్సుల పునరుద్ధరణ పేరుతో ఇలా నోటీసులు జారీ చేసి, అలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపించి, ఆస్పత్రి, పడకలు, స్కానింగ్ మిషన్లు, లేబోరేటరీల నిష్పత్తిని బట్టి వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిని మళ్లీ సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అర్హత, అనుభవం లేకపోయినా గుట్టుగా అవయవమార్పిడి, సంతాన సాఫల్యం వంటి ఖరీదైన చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరుపై నిఘా పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది.
భారీగా ముడుపులు
జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్హోమ్లు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మూడు వేలకుపైగా ఉన్నట్లు అంచనా. వీటిలో 2,500 వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అను మతులు పొందాయి. మరో 400 వరకు ఎలాంటి అనుమతులు లేని క్లినిక్లు ఉన్నట్లు అంచనా. అర్హతలు, అనుమతులు లేకుండా చికిత్స చేస్తున్న ఆస్ప త్రులు, వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద, యునానీ కోర్సులు చేసిన వారు అల్లో పతి వైద్యులుగా.. ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యు లుగా చలామణి అవుతున్నారు. ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన చోట ఇన్పేషంట్లకు చికిత్స లు అందిస్తున్నారు. అబార్షన్లతో పాటు కుటుంబ నియంత్రణ, సున్తీ వంటి చికిత్సలు చేస్తున్నారు. అధిక రక్తస్రావం సహా ఇతర కారణాలతో ఆయా బాధితులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులను, ఆస్పత్రులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు గుర్తించి, కేసులకు సిఫార్సు చేస్తోంది. ఆ బాధ్యతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగిస్తోంది. ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నారు. ఆస్పత్రు ల లైసెన్సులు రద్దు చేయక పోగా, కొద్ది రోజులకే వాటిని తిరిగి తెరిపిస్తున్నారు. ఇందుకు ఒక్కో ఆస్ప త్రి నుంచి భారీగా ముడుపులు ముడుతున్నట్లు తెలిసింది. కందుకూరు, షాద్నగర్ డివిజన్ల పరిధిలో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటేషన్లపై అడ్డదారిలో వచ్చిన ఓ వైద్యురాలు.. గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే డిప్యూటీ డీఎంహెచ్ఓగా కొనసాగుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఒకరి పేరున.. మరొకరు
నిజానికి ఏ వ్యక్తి పేరునైతే ఫార్మసీ, ల్యాబ్లకు లైసెన్స్ పొందుతారో ఆ వ్యక్తి విధిగా అందుబాటులో ఉండాలి. కానీ మెజార్టీ కేంద్రాల్లో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండటం లేదు. కనీస అర్హత లేని వారితో రక్త, మూత్ర వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే అటెండర్లు మందులు ఇచ్చేస్తున్నారు. కీలకమైన స్కానింగ్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. రేడియాలజిస్టుకు బదులు ఎక్సరే టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులతో పరీక్షలు చేయిస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడో మగో ముందే చెబుతూ పరోక్షంగా అబార్షన్లకు కారణమవుతున్నారు. జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, వీటిలో మెజార్టీ సెంటర్లలో కనీస అర్హత ఉన్నవారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మూడు నెలలకోసారి మెడికల్ షాపుల నుంచి అసోసియేషన్ ప్రతినిధులే వసూలు చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ముడుపులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది.