
‘ఔట్ సోర్సింగ్’పై వేటు
9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీలో పాత్ర ఉందని గుర్తించిన జీహెచ్ఎంసీ 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లపై వేటు వేసింది. విధుల నుంచి వారిని తొలగించింది. జీహెచ్ఎంసీలోని 14 సర్కిళ్ల పరిధిలో ఈ అక్రమా లు జరిగినట్లు గుర్తించి వారిని తొలగించారు. బుధవారం జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం జరిగేంత వరకు వారిని తొలగించినట్లు వెల్లడి కాలేదు. నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాధ్యులను గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని, 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు సభకు సమాధానమిచ్చారు. ఔట్సోర్సింగ్వారిపై తప్ప అధికారులపై చర్యలు తీసుకోరా? అనే సభ్యుల ప్రశ్నకు బదులిస్తూ పోలీసు కేసులు నమోదయ్యాయని, విచారణ జరుగుతోందని, దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, గోషామహల్, ఖైరతాబాద్, ఆర్సీపురం–పటాన్చెరు, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలోని కంప్యూటర్ ఆపరేటర్లను, మలక్పేట, సంతోష్నగర్, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, గోషామహల్, ఆర్సీపురం–పటాన్చెరు, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోని హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు.
అధికారుల పాత్ర లేకుండా సాధ్యమా ?
ఈ నేపథ్యంలో అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ఔట్సోర్సింగ్పై పనిచేసే వారే బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేశారా? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. నకిలీ సర్టిఫికెట్లకు వారిని బాధ్యులుగా పేర్కొంటూ, కేవలం వారిపైనే వేటు వేయడంతో జీహెచ్ఎంసీ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా ఈ ‘దందా’ జరుగుతున్నా, దాదాపు రెండున్నరేళ్లక్రితమే అవకతవకలు దృష్టికి రావడంతో అప్పట్లో జారీ అయిన సర్టిఫికెట్లను రద్దు చేశామని చెబుతున్నప్పటికీ, ఇంతవరకు ఇంకా ఎందుకు నకిలీ సర్టిఫికెట్ల జారీని కట్టడి చేయలేకపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో వీరి పాత్ర ఉందని..