
నాలాల కబ్జాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నాలాల కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టి సారించారు. సోమవారం ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై గురువారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. తొలుత హస్మత్పేట్ పికెట్ నాలా, ప్యాట్నీ సెంటర్ వద్ద హస్మత్పేట్, పికెట్ నాలాలు కుంచించుకుపోవడంతో మహేంద్ర హిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయి, విమాన్నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు ఆధారాలతో చూపించారు. నాలా కబ్జాలకు గురికావడంతో వేలాది ఇళ్లు ప్రతిసారీ మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కంటోన్మెంట్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. నగరంలోని నాలాలపై కిర్లోస్కర్ కమిటీ, ఓయెంట్స్ కమిటీ నివేదికలతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
చీకోటి గార్డెన్స్లోనూ..
ప్రకాష్నగర్ మెట్రోతో పాటు చీకోటి గార్డెన్స్ ప్రాంతాలు 3 సెం.మీ వర్షం కురిస్తే నీట మునుగుతున్నాయి. ఇక్కడ అర మీటర్ల వెడల్పు వరద కాల్వ కొన్ని చోట్ల 4.5 మీటర్ల మేర కబ్జా అయ్యిందని స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఎవరికి నచ్చినట్లు వారు నాలాను డైవర్ట్ చేశారని పేర్కొన్నారు. దీంతో సమీప ప్రాంతాలు, అపార్ట్మెంట్లు చిన్నపాటి వర్షానికే నీట మునుగుతున్నాయన్నారు. అధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.