రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్ర
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు. ఇతగాడిని తెలంగాణ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేయగా... చైన్నె అధికారులు పీటీ వారెంట్పై అక్కడకు తరలించారు.
● ఉత్తరాఖండ్కు చెందిన విజయ్కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. బతుకుతెరువు కోసం ఒడిస్సాలో స్థిరపడిన ఇతగాడు కుటుంబాన్ని వదిలేసి హఠాత్తుగా బాబా అవతారం ఎత్తాడు. తన పేరును ఓంగా మార్చుకుని దేశ సంచారం మొదలుపెట్టాడు. భిక్షాటన చేసుకుంటూ జీవించడం, కనిపించిన రైలు ఎక్కడం, నచ్చిన చోట దిగడం, ప్లాట్ఫామ్స్పై దొరికినవి తినడం ఇవే దినచర్యలుగా కొన్నేళ్లు బతికేశాడు.
● రైళ్లు, రైల్వే ప్లాట్ఫామ్స్పై ఇలాంటి బాబాలు, భిక్షాటన చేసే వాళ్లు, హిజ్రాల బెడద పెరిగిపోతున్నాయంటూ ప్రయాణికుల నుంచి రైల్వే అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వాళ్లను ఉపేక్షించవద్దని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
● అప్పటి నుంచి టీసీలు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు ఇలాంటి వాళ్లు ఎక్కడ కనిపించినా టికెట్ తనిఖీ చేయడం, లేకపోతే దింపేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలులో ఒడిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓం బాబాను టిక్కెట్ లేని కారణంగా టీసీ మార్గమధ్యంలో దింపేశారు. ఈ విషయంలోనే ఓం బాబా హర్ట్ అయ్యాడు. దీంతో ఏకంగా రైల్వేల పైనే కక్ష పెంచుకున్నాడు.
● నగరంలోని కాచిగూడ–బుద్వేల్ మధ్య రైలు పట్టాలపై పెద్ద కర్రలు, రాళ్లు పెట్టాడు. వీటిని గుర్తించిన గ్యాంగ్మెన్లు తొలగించి, ఆర్పీఎఫ్కు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు మఫ్టీలో రంగంలోకి దిగడంతో పాటు గ్యాంగ్మెన్లను అప్రమత్తం చేశారు.
● కాటేదాన్ ప్రాంతంలో రైలు పట్టాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓంను గుర్తించిన ఆర్పీఎఫ్ అతడిని అదుపులోకి తీసుకుంది.
● విచారణ నేపథ్యంలో ఈ నేరాలు తానే చేసినట్లు అతడు అంగీకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు.
● నగరంలో ఈ పని చేసి, అరెస్టు కావడానికి మధ్యలో చైన్నె వెళ్లిన ఓం అక్కడా ఇలాంటి పనే చేశాడు. విల్లివాక్కం, అంబత్తూరు, ఆవడి, అరక్కోణంలలో రైలు పట్టాలపై వస్తువులు పెట్టడంతో ఐదు కేసులు నమోదయ్యాయి.
● ఈ ఏడాది ఏప్రిల్ 26 ఉదయం 9.30 గంటలకు అవడి రైల్వే యార్డ్ వద్ద సిగ్నల్ ఆపరేషన్ విఫలమైంది. రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్ను పరిశీలించగా ఐరన్న్ పెండ్రాల్ క్లిప్లు తొలగించినట్లు గుర్తించారు. క్లిప్లు, రెండు అంగుళాల ఇనుప ముక్కలను ట్రాక్పై ఉంచినట్లు తేల్చారు.
● మరుసటి రోజు రాత్రి 7 గంటలకు అరక్కోణం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆరు పాయింట్ల వద్ద బ్యాలస్ట్, ఇనుప ముక్కలు కనిపించాయి. అదే రోజు రాత్రి 11.47 గంటలకు అంబత్తూరు రైల్వే స్టేషన్లో ఐదు చోట్ల బ్యాలస్ట్లు ఉంచినట్లు ఆర్పీఎఫ్కి సందేశం వచ్చింది.
● రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై బ్యాలస్ట్ను తొలగించి, ట్రాక్పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇక్కడి అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో చైన్నె ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
● దీంతో ఓంపై అక్కడి కోర్టు నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకొచ్చిన అధికారులు చైన్నె తరలించారు.
● తమిళనాడులో ఇతడు చేసిన పనితో ఎన్ఐఏ కూడా ఉలిక్కిపడింది. దీని వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానించి రంగంలోకి దిగింది. చివరకు ఇది ఓ దొంగ బాబా పనిగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తరాఖండ్కు చెందిన ఓ నకిలీ బాబా వ్యవహారం
హైదరాబాద్తో పాటు తమిళనాడులోనూ కేసులు
అరెస్టు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు
వారెంట్పై తీసుకువెళ్లిన చైన్నె ఆర్పీఎఫ్ బృందాలు