
ఔటర్.. ఔరా!
ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధికి సర్కారు అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలతో అనుసంధానంగా ఉంటూ ఇతర నగరాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఔటర్ చుట్టూ ఐటీ, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి ప్రాంతాలలో సెజ్ తరహాలో కంపెనీలకు స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సంస్థలకు చేరువలో నివాసాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో నగరాభివృద్ధి విస్తరించడంతో పాటు వాక్ టు వర్క్ విధానంలో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.
కనిష్టంగా వెయ్యి ఎకరాలు..
ఔటర్ చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఔటర్కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఒక్కోచోట వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా భూములను సేకరించాలన్న అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మరోవైపు గతంలో ఏవైనా సంస్థలకు స్థలాలు ఇచ్చి అవి ఇంకా కార్యకలాపాలు ప్రారంభించకపోతే వాటిని వెనక్కి తీసుకునే మార్గాలను కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
వాక్ టు వర్క్ తరహాలో..
ఔటర్ చుట్టూ రానున్న పరిశ్రమలు వాక్ టు వర్క్ విధానంలో ఉండాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. కంపెనీలకు చేరువలోనే నివాసాలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) తరహాలో ఒకేచోట 300 ఎకరాల భూములు సేకరించాలని, పరిశ్రమలు, ఐటీ సంస్థలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేస్తే అక్కడ నివాసం ఉండేందుకు వీలుంటుందని రెవెన్యూ అధికారుల భావిస్తున్నారు. ఇందుకోసం 300 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించాలని నిర్ణయించారు. రోడ్లు, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలను అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు.
అభివృద్ధి విస్తరణ..
ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో యాపిల్ ఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎలక్ట్రానిక్ సిటీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు పరిశ్రమలతో పాటు షాబాద్ మండలంలో విద్యుత్ బస్సుల తయారీ, టెక్స్టైల్స్ పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ, పరిశ్రమల హబ్లలో పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు వాటికి సమీపంలో విద్యా సంస్థలు, వినోద కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, రెస్టారెంట్లను ప్రారంభిస్తే అభివృద్ధి మరింత విస్తరించే అవకాశముంది.
ఐటీ, పరిశ్రమలకు స్థలాల కేటాయింపునకు కసరత్తు
òÜgŒæ ™èlÆý‡àÌZ HÆ>µr$ ^ólĶæ*ÌS° °Æý‡~Ķæ$…
కంపెనీలు, నివాసాలు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు