
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో విదేశాలకు..
శంషాబాద్: అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థి సర్టిఫికెట్ నకిలీదిగా తేలడంతో హైదరాబాద్లోని ఓ నకిలీ సర్టిఫికెట్ విక్రయిస్తున్న కన్సెల్టెన్సీ గుట్టు రట్టైంది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ తెలిపిన మేరకు..నల్గొండ జిల్లా పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన పకీరు గోపాల్రెడ్డి 2018లో మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించి ఏడాదిన్నర కిందట అమెరికాలోని వెబ్స్టర్ వర్సిటీలో 28 వేల డాలర్ల ఫీజు చెల్లించి ఉన్నత చదువులో ప్రవేశం పొందాడు. 15 నెలలు చదివిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఐదు నెలలు ఇక్కడే ఉన్నాడు. నాలుగురోజుల కిందట అమెరికా వెళ్లిన అతడిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు యునివర్సిటీలో ఇన్యాక్టివ్ విద్యార్థిగా గుర్తించి స్వదేశానికి తిప్పిపంపారు. దీంతో తిరిగి వచ్చే క్రమంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడి వీసాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు పరిశీలించగా నకిలీ సర్టిఫికెట్ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు అప్పగించారు.
పదిహేను మందికి పైగా..
నకిలీ సర్టిఫికెట్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్రెడ్డిని విచారించగా బీఎన్రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో ఉన్న ధనలక్ష్మీ ఒవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో రూ.80 వేలకు డిగ్రీ సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సిద్దేశ్వర్ పోలీసుల బృందం ధనలక్ష్మీ ఒవర్సీస్ సంస్థపై దాడులు చేశారు. సంస్థ నిర్వాహకుడు కాతోజు అశోక్ను అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ ఉన్న మధురై కామరాజ్, ఉస్మానియా వర్సిటీలకు చెందిన 17 నకిలీ డిగ్రీ, ప్రొవిజినల్ మార్కుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన విద్యార్హత లేకుండా విదేశీ విద్యనభ్యసించాలనుకునే వారు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ నకిలీ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు గుర్తించారు. పదిహేనుమందికిపైగా నకిలీ సర్టిఫికెట్లతో విదేశీ విద్యకు వెళ్లినట్లు విచారణలో అశోక్ వెల్లడించాడు. కేరళకు చెందిన వ్యక్తికి ఒక్కో సర్టిఫికెట్కు రూ.30 వేలు ఇస్తే..అతడే సర్టిఫికెట్లు తయారుచేసి పంపిస్తున్నట్లు తెలిపాడు. అశోక్ నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన నకిలీ స్టాంపులు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్రెడ్డి, అశోక్లను రిమాండ్కు తరలించగా కేరళకు చెందిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఓ కన్సల్టెన్సీ నిర్వాకం
అమెరికా నుంచి తిరిగొచ్చిన విద్యార్థి సర్టిఫికెట్ పరిశీలనలో బయటపడ్డ వైనం
కేరళలో తయారీ..హైదరాబాద్లో విక్రయం
ఇద్దరి అరెస్ట్..ఒకరి పరారీ

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో విదేశాలకు..