
మళ్లీ పోలీస్ చేతికి జేమ్స్ స్ట్రీట్ భవనం
బన్సీలాల్పేట్: హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టిన జేమ్స్ స్ట్రీట్ భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారని, త్వరలోనే రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని రాంగోపాల్పేట్ పురాతన పోలీసు స్టేషన్ను మంగళవారం ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాల్, నగర ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెడ్గే తదితరులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడారు. రాంగోపాల్పేట్ పాత పోలీసు స్టేషన్కు హెచ్ఎండీఏ మరమ్మతులు నిర్వహించి బ్రహ్మాండంగా తయారు చేశారన్నారు. సదరు స్టేషన్ను తిరిగి తమకు అప్పగించడం జరిగిందని తెలిపారు. త్వరలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. జేమ్స్ స్ట్రీట్ భవనం 1870 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుంచి 2016 వరకు సుదీర్ఘకాలం రామ్గోపాల్పేట్ పోలీసు స్టేషన్ ఇక్కడే కొనసాగింది. ఆ తర్వాత మరమ్మతుల కోసం తొమ్మిదేళ్ల క్రితం హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుని..ఇప్పుడు అప్పగిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు సంబంధించిన వస్తువులను తిరిగి ఇక్కడి తీసుకవచ్చి పోలీసు కార్యకలాపాలు సాగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పురాణి హవేలిలోని సిటీ పొలీసు కమిషనర్ కార్యాలయం మరమ్మతులు పూర్తి కావచ్చాయని, త్వరలో ఈ భవనాన్ని ప్రారంభించి అక్కడి నుంచీ నగర పోలీసు కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
బీజేపీ కార్పొరేటర్లతో
కిషన్రెడ్డి సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన వారితో చర్చించారు. బస్తీ పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయన ప్రస్తావించారు. వర్షాకాల సన్నద్ధతపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కార్పొరేటర్లకు సూచించారు. అలాగే గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైన కూడా ప్రశ్నించాలని సూచించారు. గ్రేటర్ సమస్యలపై బల్దియా మీటింగ్లో అంశాల వారీగా ఏయే కార్పొరేటర్లు ఏం మాట్లాడాలనే దానిపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
● రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ త్వరలో అక్కడికి తరలింపు
● సందర్శించిన సీపీ సీవీ ఆనంద్