
వేర్వురుగా రెయిన్ వాటర్, సీవరేజ్ లైన్లు
జలమండలి ఎండీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సీవరేజ్, వాననీటి కాలువ అనుసంధానం పాయింట్లను గుర్తించి రెండు లైన్లను వేర్వేరుగా నిర్మించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సోమవారం మలక్పేట్లోని నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ మరమ్మతు పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రెండు దశాబ్దాల క్రితం నాటి సీవరేజ్ లైను శిథిలమైపోవడంతో అవుట్లెట్ లేక వర్షం కురిసిన సమయాల్లో సీవరేజ్ రహదారిపై పొంగుతున్నట్టు గుర్తించారు. సీవరేజ్ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. మలక్పేట్ ఆర్యూబీ వరకు సీవరేజ్ లైన్ల నిర్మాణం చేపట్టడానికి అధికారులతో చర్చించారు. కొత్త సీవరేజ్ లైన్ల వల్ల తాత్కాలికంగా మురుగు సమస్య తలెత్తకుండా ఉంటుందని అన్నారు. అలాగే సమీపంలోని భవనాలనుంచి ఉత్పన్నమయ్యే సీవరేజ్ను ఎక్కడికక్కడే కాకుండా ఒకే అవుట్లెట్ వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సమీపంలోని అన్ని సీవరేజ్ లైన్లను, మ్యాన్ హోళ్లను డీసిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం ఇతర అధికారులు, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.