
పోర్టబిలిటీ ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో:
నగరంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోటాపై పోర్టబిలిటీ విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. పోర్టబిలిటీ విధానంలో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండటంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన షాపులోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ కోటా డ్రా చేస్తున్నారు. వాస్తవంగా గత నెల వరకు దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగడంతో కోటా డ్రా చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతుండటంతో కోటా డ్రా చేసేందుకు గత వారం రోజులుగా రేషన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. పోర్టబిలిటీ విధానంలో బియ్యం కోటా డ్రా కారణంగా రేషన్ దుకాణాల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. ఫలితంగా బియ్యం కోటా డ్రాకు రేషన్ షాపుల చుట్టూ లబ్ధిదారులు చక్కర్లు కొటాల్సిన పరిస్థితి నెలకొంది.
17.40 లక్షల కుటుంబాలు..
గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డులు కలిగిన సుమారు 17.40 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో ఈ నెల 8 వరకు సుమారు 11.02 లక్షల కుటుంబాలు సన్న బియ్యం కోటాను డ్రా చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం పోర్టబిలిటీ విధానంలోనే సుమారు 6.92 కుటుంబాలు తమ కోటాను డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ పరిధిలో 2.98 లక్షలు, రంగారెడ్డి పరిధిలో 1.74 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో 2.19 లక్షల కార్డుదారులున్నట్లు తెలుస్తోంది.
కేటాయింపు కంటే.. అదనంగా
ప్రభుత్వ చౌకధరల దుకాణాల పరిధిలోని రేషన్ కార్డులు అందులోని యూనిట్లను బట్టి బియ్యం కోటాను పౌరసరఫరాల శాఖ కేటాయిస్తోంది. ప్రతినెలా బియ్యం కోటా సుమారు 70 నుంచి 85 శాతం వరకు డ్రా అవుతోంది. పోర్టబిలిటీ విధానంలో సుమారు 10 నుంచి 15 శాతం బియ్యం కోటా డ్రా చేసినా.. మిగిలిన కోటా సర్దుబాటు అవుతోంది. కొన్నిసార్లు అదనంగా మరో 10 శాతం కోటా కూడా కేటాయింపు జరగడంతో నిల్వలపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే.. ఈసారి సన్నబియ్యం పంపిణీ జరుగుతుండటంతో డ్రా తాకిడి పెరిగింది. గత నెలలో ఎన్నికల కోడ్ కారణంగా హైదరాబాద్ పరిధిలో సన్న బియ్యం కోటా పంపిణీ జరగలేదు. ఈ నెలలో సన్నబియ్యం పంపిణీ కొనసాగుతుండటంతో లబ్ధిదారుల కుటుంబాల ఆసక్తి పెరిగింది.
గ్రేటర్ పరిధిలో ఈనెల 8వ తేదీ వరకు సన్న బియ్యం కోటా డ్రా ఇలా..
జిల్లా మొత్తం కార్డులు కోటా డ్రా డ్రా చేసిన
చేసిన కార్డులు బియ్యం (కిలోలు)
హైదరాబాద్ 6,39,452 4,12,909 95,93,318
రంగారెడ్డి 5,71,820 3,46,444 77,42,776
మేడ్చల్–మల్కాజిగరి 5,29,698 3,43,480 75,63,696
సన్నబియ్యం పంపిణీపై తీవ్ర ప్రభావం
రేషన్ షాపుల్లో నిండుకుంటున్న నిల్వలు
కోటా కోసం లబ్ధిదారుల చక్కర్లు
ఇప్పటివరకు 64 శాతం బియ్యం డ్రా
15 వరకు బియ్యం కోటా గడువు
రేషన్ సరుకుల డ్రా గడువు ఈ నెల 15తో ముగియనుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 64 శాతం కార్డు దారులు మాత్రమే బియ్యం కోటాను డ్రా చేశారు. మరో 36 శాతం డ్రా చేయాల్సి ఉంటుంది. మొత్త బియ్యం డ్రా చేసిన కుటుంబాల్లో సైతం సగం మంది పోర్టబిలిటీ విధానంలో సరుకులు డ్రా చేసినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దు జిల్లాల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు కూడా నగరంలో సుమారు మూడున్నర లక్షల ఉండటంతో వారు కూడా ఇక్కడే పోర్టబిలిటీ విధానంలో సరుకులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు సగానికి పైగా సరుకులు డ్రా చేయనట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు నిండుకుండటంతో పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్వరమే స్టాక్ కొరత ఉన్న రేషన్ షాపులకు అదనపు బియ్యం కోటా సరఫరా చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.