
జాగ్రత్త సుమా!
శిథిల భవనాలతో
వర్షా కాలంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. శిథిలావస్థలో ఉన్న భవనాలను సర్వే చేసి, ప్రమాదకర భవనాలు, కట్టడాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ కర్ణన్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రాధాన్యతతో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. సర్క్యులర్లోని ఆదేశాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
సర్కిళ్లలో సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే జరిపి శిథిల భవనాలు, పాత ప్రహరీలు తదితరమైనవి గుర్తించాలి. వాటి వివరాలను ఇంజినీరింగ్ విభాగానికి పంపించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు చేయించి నివేదిక తెప్పించుకోవాలి. గత సంవత్సరం నివేదిక మేరకు మిగిలిపోయిన శిథిల భవనాలతో సహ మొత్తం ఎన్ని శిథిలభవనాలున్నాయో గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల భవనాలు ప్రమాదకరంగా ఉంటే వెంటనే తగిన చర్యల కోసం సంబంధిత ప్రిన్సిపాల్ లేదా విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. ప్రైవేటు భవనాలకు సంబంధించి నిబంధనల కనుగుణంగా నోటీసులు జారీ చేయాలి.
ప్రమాదకర భవనాలపై చర్యలు
అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయించే, సీల్ వేసే చర్యలు చేపట్టాలి. శిథిల నిర్మాణాల చుట్టూ బారికేడింగ్ చేయడంతో పాటు ప్రజలు వాటి సమీపంలో సంచరించకుండా హెచ్చరిక బోర్డులు ఉంచాలి. నోటీసులందుకున్న భవన యజమానులు మరమ్మతు చర్యలు చేపడితే ప్రమాణాలకు అనుగుణంగా మరమ్మతులు జరిగిందీ, లేనిదీ గుర్తించాలి. మరమ్మతులు చేయించిన యజమానుల నుంచి స్ట్రక్చరల్స్టెబిలిటీ సర్టిఫికెట్లు తీసుకోవాలి.
కూల్చివేతలకు స్పెషల్ డ్రైవ్స్
ప్రమాదకర భవనాలను నిర్ణీత వ్యవధుల్లో కూల్చివేసేందుకు స్పెషల్డ్రైవ్స్ నిర్వహించాలి. అన్ని సర్కిళ్ల డిప్యూటీ సిటీ ప్లానర్లు / అసిస్టెంట్ సిటీ ప్లానర్లు తక్షణమే చర్యలు చేపట్టి ప్రధాన కార్యాయానికి నివేదిక అందజేయాలి. చీఫ్ఇంజినీర్ (మెయింటనెన్స్) సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్లు త్వరితంగా ఇచ్చేలా చూడాలి.శిథిల భవనాల అప్డేటెడ్ సమాచారాన్ని గూగుల్ స్ప్రెడ్షీట్లో జియో కోఆర్డినేట్స్ లింక్తో సహ అందజేయాలి. జోనల్ కమిషనర్లు తమ సర్కిళ్లలో ఈ పనుల్ని సమీక్షిస్తూ, నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా సంబంధిత అధికారులను సమన్వయం చేయాలి. శిథిల, ప్రమాదకర భవనాల విషయంలో పై ఆదేశాలు పాటించని, నిర్లక్ష్యం కనబరిచే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
పూర్తిస్థాయి సర్వే.. ప్రమాదకర భవనాల కూల్చివేతలు
అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు