
డిజిటల్ అరెస్టు పేరుతో రూ.84 లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ అరెస్టు పేరు చెబుతూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కాల్ చేసిన కేటుగాళ్లు రూ.84 లక్షలు కాజేశారు. ఆద్యంతం ఆమెను భయంలో ఉంచిన ఈ–కేడీలు తాత్కాలిక బెయిల్ కూడా ఇచ్చారు. ఎట్టకేలకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్ పూర్వాపరాలిలా ఉన్నాయి... ఓ ప్రభుత్వ ఉద్యోగినికి (57) ఈ ఏడాది మార్చి 4న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ట్రాయ్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి... ఆమెను పూర్తిగా నమ్మించేందుకు తన ఐడీ నెంబర్ అంటూ ఓడీ62813 అనే సంఖ్యను చెప్పాడు. బాధితురాలి పేరుతో నమోదై ఉన్న సెల్ నెంబర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఫిర్యాదు ఉందంటూ కంప్లైంట్ నెంబర్ కూడా చెప్పాడు. వీలున్నంత త్వరగా వ్యక్తిగతంగా వెళ్లి ట్రాయ్ కార్యాలయంలో అధికారులకు కలవాలని చెప్పాడు. ఆ కొద్దిసేపటికి ముంబై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రతినిధిని అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన అతను తతను దర్యాప్తు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన వ్యాపారి నరేష్ గోయల్ వ్యవహారాల్లో బాధితురాలి పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ వాడారని చెప్పాడు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమైనందున న్యాయపరమైన అంశాలు అనేకం ఉంటాయని, అప్పటి వరకు విషయం కుటుంబీకులతో సహా ఎవరికీ చెప్పద్దని స్పష్టం చేశాడు. గత నెల 8న వాట్సాప్ ద్వారానే బాధితురాలికి మరో వీడియో కాల్ వచ్చింది. కేసుకు సంబంధించిన చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా చెప్పుకున్న ఆ వ్యక్తి కీలక కేసులో ఆరోపణలు ఉండటంతో మీ ఆర్థిక లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలించి, క్లీన్ చిట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. నరేష్ గోయల్తో సంబంధాలు ఉన్న స్లీపర్ సెల్స్ కొందరు బెదిరింపులకు దిగే అవకాశం ఉందని, ఈ కారణంగానే మీ ఫోన్పై పూర్తి నిఘా ఉంచుతామని చెప్పాడు. గత నెల 11న వీడియో కాల్ చేసిన మరో నేరగాడు తాను సర్వైలెన్స్ ఆఫీసర్నిని పరిచయం చేసుకున్నాడు. డిఫెన్స్ లాయర్ అంటూ మరో నేరగాడినీ పరిచయం చేసిన అతను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బాధితురాలికి చెప్పాడు. డిఫెన్స్ లాయర్గా చెప్పుకున్న వ్యక్తి వర్చువల్గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారని చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధితురాలు తన భర్త ఆరోగ్యం బాలేదని, వర్చువల్ అప్పీరెన్స్కు కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఆమెకు వాట్సాప్ ద్వారా టెంపరరీ బెయిల్ అని రాసి, సుప్రీం కోర్టు పేరుతో ఉన్న పత్రాలు, రూ.30 లక్షల విలువైనదిగా తయారు చేసిన నకిలీ ష్యూరిటీ బాండ్ పంపించాడు. దీని నిమిత్తం ఆ మొత్తం తన ఖాతాల్లో వేయించుకున్నాడు. తాము కోరిన మొత్తం సూచించిన బ్యాంకు ఖాతాల్లో వేయాలని, ఆ లావాదేవీలను ఆర్బీఐ, న్యాయస్థానం పరిశీలించి క్లీన్ చిట్ ఇస్తాయని నమ్మించాడు. ఆపై కేసు వీగిపోవడంతో పాటు డిపాజిట్ చేసిన నగదు అంతా రిఫండ్ వస్తుందని నమ్మించాడు. దీంతో బాధితురాలు తన ఎఫ్డీలు విత్డ్రా చేసి, బంగారంపై రుణం తీసుకుని, అప్పులు చేసి మొత్తం రూ.84 లక్షలు నేరగాళ్లు సూచించిన ఖాతాల్లో వేశారు. మంగళవారం ఆఖరుసారిగా కాల్ చేసిన నేరగాళ్లు కేసు క్లోజ్ అయిందని, డిపాజిట్ చేసిన మొత్తం త్వరలోనే రిఫండ్ అవుతుందని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి వారి ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ అయిపోయాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా
నరేష్ గోయల్ కేసుతో సంబంధం ఉందని ఫోన్
తాత్కాలిక బెయిల్,
రిఫండ్ అంటూ మోసం