అడ్డంగా దోచేసిన అకాల్‌ ఈ–వరల్డ్‌! | - | Sakshi
Sakshi News home page

అడ్డంగా దోచేసిన అకాల్‌ ఈ–వరల్డ్‌!

May 9 2025 8:16 AM | Updated on May 9 2025 8:16 AM

అడ్డంగా దోచేసిన అకాల్‌ ఈ–వరల్డ్‌!

అడ్డంగా దోచేసిన అకాల్‌ ఈ–వరల్డ్‌!

సాక్షి, సిటీబ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల డీలర్‌షిప్‌ ఇస్తామంటూ నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.కోటి తీసుకుని నిండా ముంచిన ఆరోపణలపై మొహాలీకి చెందిన అకాల్‌ ఈ–వరల్డ్‌ సంస్థపై సిటీ సీసీఎస్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. డీలర్‌షిప్‌ ఇవ్వడంతో పాటు ఈజెడ్‌వై గో ఈవీ పేరుతో తయారయ్యే వాహనాలు సరఫరా చేస్తానంటూ సదరు కంపెనీ హామీ ఇచ్చినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. బోరబండకు చెందిన వ్యాపారి డి.రమేష్‌ గౌడ్‌ 2023 నవంబర్‌లో ఈవీల డీలర్‌ షిప్‌ కోసం అకాల్‌ సంస్థను సంప్రదించారు. పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న వారి కార్యాలయం, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని వాహనాల తయారీ యూనిట్‌ సందర్శించిన తర్వాత పూర్తి సంతృప్తి చెందిన అతను సదరు కంపెనీ సీఎండీ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, మార్కెటింగ్‌ హెడ్‌ గౌతమ్‌ సింగ్‌లతో సంప్రదింపులు జరిపారు. డీలర్‌షిప్‌ ఇవ్వడంతో పాటు వాహనాలు సరఫరా చేస్తామని, షోరూమ్‌ నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటూ వాళ్లు హామీ ఇచ్చారని రమేష్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీలర్‌షిప్‌ కోసం గత ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్య విడతల వారీగా రూ.57 లక్షలు అకాల్‌ సంస్థకు చెల్లించాడు. అమీర్‌పేటలో షోరూమ్‌ ఏర్పాటు కోసం మరో రూ.19 లక్షలు, సిబ్బంది జీతభత్యాలు, షోరూమ్‌ అద్దె కోసం మరో రూ.14 లక్షలు ఖర్చు చేశారు. గత ఏడాది ద్వితీయార్థానికి షోరూమ్‌ సిద్ధమైంది. అయితే అకాల్‌ సంస్థ కేవలం 20 వాహనాలను మాత్రమే సరఫరా చేసింది. వీటిలో 13 వాహనాలను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మరో షోరూమ్‌కు పంపిన కంపెనీ మిగిలిన వాటిని వేర్వేరు వినియోగదారులకు అందించింది.

ఈ క్రయవిక్రయాలకు సంబంధించిన నగదు రమేష్‌కు చేరాల్సి ఉండగా... నేరుగా హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, గౌతమ్‌లే తీసుకున్నారు. కొన్నాళ్లకు ఆ ఇద్దరి నుంచి స్పందన కరువుకావడంతో అనుమానం వచ్చిన రమేష్‌ మొహాలీ వెళ్లి చూడగా సదరు సంస్థ కార్యాలయం మూతపడినట్లు గుర్తించాడు. దీంతో తనతో పాటు రూ.43.7 లక్షలు పెట్టుబడిగా పెట్టిన మరో నలుగురూ ఆర్థికంగా నష్టపోయారని రమేష్‌ ఆరోపించాడు. అకాల్‌ కంపెనీకి చెల్లింపులు చేయడానికి రుణాలు తీసుకోవడంతో పాటు బంగారాన్నీ కుదువపెట్టానని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడడు. దాదాపు ఏడాది పాటు ఆ కంపెనీతో పాటు దాని యజమానుల ఆచూకీ కోసం ప్రయత్నించిన రమేష్‌ గౌడ్‌ చివరకు సోమవారం సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా అకాల్‌ కంపెనీతో పాటు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య జస్బీర్‌ కౌర్‌, కుమారుడు సహిబ్‌జ్యోత్‌ సింగ్‌, గౌతమ్‌ సింగ్‌లపై కుట్ర, మోసం సహా వివిధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల డీలర్‌షిప్‌ ఇస్తానంటూ మోసం

నగర వ్యాపారి నుంచి భారీ మొత్తం తీసుకున్న వైనం

లోతుగా దర్యాప్తు చేస్తున్న

సిటీ సీసీఎస్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement