
చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసింది..
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమైపె నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..
చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
● నగల షాపులను బురిడీ కొట్టిస్తున్న ‘కిలేడీ’
● రూ.50 లక్షల విలువైన నగలు టోకరా
● నిందితురాలి కోసం గాలింపు
మహిళ దారుణ హత్య
చాంద్రాయణగుట్టలో ఘాతుకం