
ఈ పింఛన్లు పెండింగ్లోనే..
పింఛన్లపై
● రూ.4 వేలకు పెరగనున్న నగదు
● ఆరు గ్యారంటీల్లో ‘చేయూత’ ఒకటి
● పెండింగ్, కొత్త దరఖాస్తులకు అవకాశం వచ్చేనా?
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలపై దృష్టి సారించి ఇప్పటికే రెండింటి అమలుకు శ్రీకారం చుట్టింది. మరో గ్యారంటీ ‘చేయూత’పై ఆశలు చిగురిస్తున్నాయి. గ్యారంటీ అమలైతే.. పేద కుటుంబాల వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల తదితర సామాజిక పెన్షన్ల నగదు పెరగనుంది. ప్రస్తుతం నెలవారీగా రూ.2016 పెన్షన్ అందుతుండగా.. ఈ మొత్తం రూ.4 వేలకు చేరనుంది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు మాత్రం రూ.4016కు పెంచింది. అయితే కొత్త సర్కారు కూడా మరికొంత పెంచే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది.
పెన్షన్దారులు 6.33 లక్షల మందికిపైగా..
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం మీద 6,33,209 మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీరిలో దివ్యాంగులు 81,114 మంది ఉండగా.. మిగిలిన వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత, బీడీ వర్కర్స్,హెచ్ఐవీ, ఫైలేరియా తదితర పెన్షన్దారులు 5,52,095 మందికి పైగా ఉన్నారు. మరోవైపు పెన్షన్ల కోసం దరఖాసుకున్న వారు మరో రెండు లక్షల మంది వరకు ఉండవచ్చని అంచనా. దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ జరిగి సెర్ఫ్నకు ప్రతిపాదనలు వెళ్లినా మంజూరు మాత్రం పెండింగ్లోనే ఉండిపోయింది. దరఖాస్తు చేసుకోని వారు మరో లక్ష మంది వరకు ఉండవచ్చని అంచనా.
నాలుగేళ్లుగా ఎదురుచూపులే..
గత ప్రభుత్వంలో నాలుగేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు ఊసే లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం వయసు సడలింపు 57 ఏళ్లకు పైబడి వారినుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ.. అందులో 40 శాతం మాత్రమే మంజూరు లభించగా మిగతా తిరస్కరణకు గురయ్యాయి. 65 ఏళ్లు దాటిన వృద్ధాప్య, వింతంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ తదితర పింఛన్ల కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకుననప్పటికీ ఆమోద ముద్ర పడకపోవడం గమనార్హం.
వృద్ధాప్య పింఛనుదారు మృతి చెందితే అతని భార్యకు పింఛన్ మంజూరు ప్రక్రియ కూడా పెండింగ్లోనే మగ్గుతోంది. మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొని దరఖాస్తుదారులు కలెక్టరేట్, తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుఆన్న ఫలితం లేకుండాపోతోంది. అధికారులు సైతం పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయో స్పష్టత ఇవ్వకపోవడంతో పేద కుటుంబాలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. కొత్త ప్రభుత్వంలో అయినా తమ సమస్య పరిష్కారమవుతుందని కోటి ఆశలతో వారు ఎదురుచూస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో పింఛన్లు ఇలా..
కేటగిరీ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్
వృద్ధాప్య 1,10,609 84,836 61,742
వితంతువు 30,990 28,087 22,037
ఒంటరి మహిళ 11,286 6,535 5,876
చేనేత 08 842 138
కల్లుగీత 0 2,399 435
హెచ్ఐవీ 10,493 0 0
ఫైలేరియా 41 62 170
బీడీ 52 14 169