హెచ్ఎంటీ బియ్యం రూ.5200 – 5600
పాతవి మంచి రకం రూ.5400 – 6400
పెరిగిన ధరలతో సగటుజీవి విలవిల
సాక్షి, సిటీబ్యూరో: వండకముందే బియ్యం కుతకుతలాడుతున్నాయి. నింగినంటిన ధరలతో ముట్టుకుంటే మంట తగులుతోంది. బియ్యం ధరలు రయ్ రయ్మంటున్నాయి. మునుపెన్నడూలేని రీతిలో రికార్డు స్థాయిలో కేజీ సన్న బియ్యం కనిష్టంగా రూ. 60 నుంచి 65 వరకు పలుకుతోంది. గతేడాది ప్రథమ శ్రేణి సన్నబియ్యం కిలోకు రూ.48 నుంచి 54లోపు లభించేవి. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతున్నాయి. గతేడాది ఖరీఫ్.. ఈ ఏడాది రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతంలో కంటే 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎక్కువగా సేకరించినట్లు పౌరసరఫరాల అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం మార్కెట్కు వచ్చినా ధరలు మాత్రం ఏటా పెరుగుతూనే ఉన్నాయి. వరి ధాన్యం ఎక్కువగా వచ్చినా బియ్యం ధరల నియంత్రణలో పౌరసరఫరాల అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.
పన్నులు ఎత్తివేసినా..
జీఎస్టీ రాక ముందు మిల్లర్లు, వ్యాపారులు ప్రతి క్వింటాల్పై 4 శాతం పన్నులు చెల్లించేవారు. కానీ జీఎస్టీ అమలులోకి వచ్చాక వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భాగంగానే బియ్యంపై వ్యాట్ను కూడా పూర్తిగా ఎత్తివేశారు. కానీ కేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పన్నులు రద్దు చేసినా బియ్యం ధరలు విపరీతంగా పెంచి మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కొనుగోలుదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం సరైన రీతిలో పర్యవేక్షణ చేయని కారణంగానే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే విమర్శలున్నాయి.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ..
● గ్రేటర్ పరిధిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హోల్సేల్ మార్కెట్లో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో 250 రైస్మిల్లర్లు ఉన్నట్లు అంచనా. ప్రతి సంవత్సరం ఒక్కో మిల్లర్ వద్ద 50 నుంచి 60 టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్టు పౌరసరఫరాల వద్ద లెక్కలు ఉన్నట్లు సమాచారం. గ్రేటర్లో రోజుకు 40 నుంచి 50 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగమవుతున్నట్లు అధికారుల అంచనా. గతంతో పోలిస్తే రోజుకు 5–7 వేల క్వింటాళ్ల బియ్యం నగరంలో వినియోగవుతోంది. ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాల్కు రూ.4,200 నుంచి 4,800 పలుకుతోంది. మార్కెట్కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులు చెప్పిందే ధర. ప్రస్తుతం పాత సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ అయితే క్వింటాల్కు రూ.5,000 నుంచి 5,500 చేరింది.
● గ్రేటర్ పరిధిలోని రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. చిన్నాచితకా కిరాణా వ్యాపారులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. గత ఏడాది క్వింటాల్ సన్నబియ్యం ధర రూ.5200 పలకగా.. ప్రస్తుతం రూ.8,00 వరకు పెంచి అమ్ముతున్నారు. దీంతో జీఎస్టీ పరిధిలోంచి బియ్యాన్ని తొలగించినా కూడా సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
కిలో బియ్యం ఇలా..
గతేడాది ప్రస్తుతం
బీపీటీ రూ.52 రూ. 62
హెచ్ఎంటీ రూ.48 రూ. 58
సోనా మసూరి రూ. 56 రూ. 62
బాస్మతి రూ. 90 రూ. 120