
సోదరుడు రాజేష్కుమార్తో సబితాదేవి
రహమత్నగర్: కన్న కూతురిపై ఉన్న ప్రేమ ఆమెను హైదరాబాద్కు రప్పించింది. మదిలో తన కుమార్తెను తలచుకుంటూ మధన పడిపోతోంది. ఎలాగైనా తన బిడ్డను ఇంటికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో వందల కిలో మీటర్లు దాటి నగరానికి వచ్చింది. తన బిడ్డ ఏదో ఒక రోజు తనకు దక్కుతుందన్న చిన్న ఆశతో మూడు రోజులుగా పోలీసులు ఏర్పాటు చేసిన షెల్టర్లోనే ఉంటోంది.
వివరాల్లోకి వెళితే... బీహర్ రాష్ట్రం, సారంగ్జిల్లా, జలాల్పూర్కు చెందిన సబితా దేవికి ముగ్గురు ఆడ పిల్లలు. చిన్న కుమార్తె 9వ తరగతి చదువుతోంది. తన ఇంటి పక్కనే ఉండే యువరాజ్ అనే యువకుడు ఆమెకు మాయ మాటలు చెప్పి సెప్టెంబర్ 2 అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీనిపై సబితదేవి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే సెప్టెంబర్ 8 తన కుమార్తె ఒక వీడియో పంపించిందని సబిత వివరించింది. అక్కడి పోలీసులు లోకేషన్ ఆధారంగా రహమత్నగర్లోని గోరక్నాథ్ పశుపతి శివాలయంగా గుర్తించారు.
దీంతో తన సోదరుడు రాజేష్కుమార్తో కలిసి ఈ నెల 27న బోరబండ పోలీస్స్టేషన్కు వచ్చిన ఆమె పోలీసులకు కలిసి సమస్యను వివరించింది. వారి సూచన మేరకు మధురానగర్ పీఎస్కు చేరుకుంది. ఆమె దీన స్ధితిని చూసిన పోలీసులు అక్కడే అశ్రయం కల్పించారు. గత మూడు రోజులుగా యువరాజ్ ఫొటోను చూపిస్తూ ఎస్పీఆర్హిల్స్ ప్రాంతంలో కుమార్తె అచూకీ కోసం గాలిస్తోంది. యువరాజ్ అనే యువకుడు మంచివాడు కాదని ఆడపిల్లలను విక్రయిస్తుంటాడని ఆమే రోదిస్తూ చెప్పింది, పోలీసులు సకాలంలో అతడిని పట్టుకుంటే తన బిడ్డ దక్కు తుందని కన్నీరుమున్నీరుగా విలపించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బిజీగా ఉండటంతో దర్యాప్తులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.