రూ.450 నుంచి రూ.1.25 కోట్ల వరకూ.. కొత్త శిఖరాలు చేరిన లడ్డూ వేలం | - | Sakshi
Sakshi News home page

రూ.450 నుంచి రూ.1.25 కోట్ల వరకూ.. కొత్త శిఖరాలు చేరిన లడ్డూ వేలం

Sep 29 2023 4:32 AM | Updated on Sep 29 2023 9:13 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరంలో గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్‌ వినాయకుడు అదే విధంగా బాలాపూర్‌ లడ్డూ కూడా. అయితే ఒకప్పుడు కేవలం బాలాపూర్‌కు మాత్రమే పరిమితమైన లడ్డూ వేలం పాట ఇంతింతై...అన్నట్టుగా నగరవ్యాప్తమై ప్రతి మండపంలో వినాయక మూర్తితో సమాన ప్రాధాన్యతను సంతరించుకుంది.

వేలం వయసు 30ఏళ్లు..
ఈ లడ్డూ వేలం పాటకు 1994లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి శ్రీకారం చుట్టగా తొలి వేలం పాటలో రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకున్న భక్తులకు మంచి జరిగిందనే ప్రచారంతో...రెండో సంవత్సరమే పదిరెట్లు పెరిగి రూ.4500కి పెరిగి ఏటేటా అంతకంతకూ ఆదరణ పెరుగుతూ 2002 నుంచి లడ్డూ ధర లక్షల్లో పలకడం ప్రారంభమైంది.

కాలక్రమంలో లడ్డూ వేలం పాటని ఖైరతాబాద్‌ సహా అనేకమంది ఉత్సవ నిర్వాహకులు కూడా అనుసరించడంతో ఇది మండపాలన్నింటికీ సంప్రదాయంగా మారింది. అదే క్రమంలో తాజాగా జరిగిన లడ్డూ వేలంలో బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ లో జరిగిన వేలం పాటలో రూ.1.26 కోట్లు పలకడం దేశంలోనే రికార్డుగా చెప్పవచ్చు. గత ఆరేళ్లుగా లడ్డూ వేలం ద్వారా పోగు చేసిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు.

పంపిణీ నుంచి పొలాల్లో జల్లడం దాకా...
లడ్డూ వేలంలో పాడుకున్న వారిలో కొందరు సన్నిహితులకు, బంధువులకు పంపిణీ చేస్తుండడం, వంటకాల్లో కలపడం, మరికొందరు ఇళ్లలోని ముఖ్యమైన చోట్ల జల్లడం, కొందరైతే ఏకంగా తమ పొలాల్లో కూడా చల్లుతుండడం.. ఇలా తమ తమ భక్త విశ్వాసాలకు అనుగుణంగా చేస్తున్నారు.

లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు
రహమత్‌నగర్‌ డివిజన్‌ కమలానగర్‌ డబుల్‌బెడ్రూం నివాసాల వద్ద ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో నిర్వహించిన వేలంలో సలీం అనే ముస్లిం యువకుడు రూ.31 వేలకు లడ్డూను దక్కించుకున్నాడు.

వేలంలో లడ్డూను దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్‌

శంషాబాద్‌: పట్టణంలోని ఇంద్రారెడ్డి కాలనీ రాజీవ్‌ గృహకల్పలో మహాగణపతి వద్ద వినాయకుడి లడ్డూ వేలంలో పాటలో ట్రాన్స్‌జెండర్‌ ఐశ్వర్య రూ. 30 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

ప్రసాదం తయారీ నా అదృష్టం
త 2009 నుంచి బాలాపూర్‌ లడ్డూ తయారు చేసి అందిస్తుండడం మా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. సినిమా రంగంపై మక్కువతో నగరానికి వచ్చిన నన్ను ఆ దైవమే ఇటు నడిపించింది. లడ్డూ వేలంలో పాడుకున్న భక్తులకు జరిగినట్లుగానే లడ్డూ అందిస్తున్న మా కుటుంబానికి కూడా దైవానుగ్రహం లభించింది. నగరంలో పలు చోట్ల మా హనీఫుడ్స్‌ బ్రాంచీలు తెరిచేందుకు, ఎందరో ప్రముఖులను నా కస్టమర్లుగా మార్చుకుంటూ మా వ్యాపారాభివృద్ధి జరిగింది.
– దేవు ఉమామహేశ్వరరావు, బాలాపూర్‌ లడ్డూ తయారీదాత, హనీ ఫుడ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement