
లక్డీకాపూల్: భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్లు బుధవారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లు సైతం రాకపోకలు సాగిస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
అత్యవసర వైద్య సేవలు
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.వెంకట్ తెలిపారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించటానికి 108 అంబులెన్సులను, బేబీ పాండ్స్ దగ్గర ప్రైవేట్ అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యంతో పని చేస్తున్నామన్నారు.
జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు
భక్తుల దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లోనూ మంచినీరు అందిస్తామన్నారు.
నోడల్ అధికారుల నియామకం
వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ, ఇతర సమస్యలు పరిష్కారానికి నోడల్ అధికారుల్ని నియమించామని పేర్కొన్నారు. దీంతో పాటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లో రెండు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
