● రిటైర్డ్ ఐఏఏస్ ఆకునూరి మురళి
నయీంనగర్ : ఐదేళ్లలో ఏటా అదనంగా రూ.6 వేల కోట్లతో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయొచ్చని రిటైర్డ్ ఐఏఏస్, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (టీపీఎఫ్) సభ్యుడు ఆకునూరి మురళి అన్నారు. గురువారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో టీపీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్య సంక్షోభాన్ని అధిగమించేందుకు, ప్రతీ చిన్నారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం ప్రభుత్వ పెట్టుబడులు అత్యవసరమన్నారు. కాగా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతోపాటు ప్రైవేట్ విద్య ఖర్చులను నియంత్రించాల్సిన అవసరాన్ని వివరించడం లక్ష్యంగా టీపీఎఫ్ చేపట్టిన 12 రోజుల ఎడ్యుకేషన్ బస్సు యాత్రలో భాగంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం టీపీఎఫ్ సభ్యుడు, రిటైర్డ్ ఐఏఏస్ ఎం.చంపాలాల్, ప్రొ.పద్మజా షా, ఎన్.రుబీనా, సృజన యాదవ్, కుమారన్న, విజయకృష్ణ, అశోక్కుమార్, పి.శంకర్, నాగేశ్వర్రావు తదితరులు ప్రసంగించారు.


