కమలాపూర్ : పారిశుద్ధ్యపనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ పబ్బు సతీశ్ పిలుపునిచ్చారు. ఊరి బాగు కోసం, మనందరి ఆరోగ్యం కోసం మీ విలువైన సమయంలో కేవలం ఒక్కరోజును కేటాయించాలని యువతీ, యువకులు, గ్రామ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని స్వచ్ఛ కమలాపూర్గా తీర్చిదిద్ధాలనే ఉద్దేశంతో ఊరి కోసం ఒక్కరోజు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సీఏలు, వీఓ అధ్యక్షులు, పారిశుద్ధ్య సిబ్బంది, నేటిధాత్రి గ్రూప్స్ చైర్మన్ కట్టా రాఘవేందర్రావు, సీఈఓ కట్టా శివసుబ్రహ్మణ్యం, గ్రామస్తులు శ్రమదానం చేశారు. 3వ వార్డు రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి మురుగు కాల్వలు శుభ్రం చేశారు. సర్పంచ్ సతీశ్ మాట్లాడుతూ.. పెద్ద గ్రామం, పారిశుద్ధ్య సిబ్బంది తక్కువ ఉండడంతో పారిశుద్ధ్యం లోపించే అవకాశం ఉందన్నారు. గ్రామస్తులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఊరి కోసం ఒక్కరోజు శ్రమదానాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులను పారిశుద్ధ్య పరిరక్షణ వైపు చైతన్యవంతులు చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఉప సర్పంచ్ పుల్లా శ్రీనివాస్, సరస్వతీ శిశుమందిర్ ప్రధానాచార్యులు స్వరూపరాణి, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.


