కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నీడ కోసం గ్రీన్ నెట్ ఏర్పాటు చేశారు. శనివారం ఎండ తీవ్రత దృష్ట్యా పేషంట్లు, అటెండెంట్ల నీడ కోసం ఎంజీఎం రెండో గేట్ ప్రారంభం నుంచి ఎంఆర్డీ కార్యాలయం వరకు గ్రీన్ నెట్ ఏర్పాటు చేశారు. దీంతో వైద్యసేవల కోసం వచ్చే ప్రజలకు నీడ కల్పించడంతో కొంతవరకు ఉపశమనం కలిగింది. డీఎంఈ, కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి కోసం ఆస్పత్రిలోని పలు వార్డుల్లో 12 రంజన్లకు కూడా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు.
చెరువులో చెత్తచెదారం
కాజీపేట : వడ్డెపల్లి చెరువు కట్ట కింద ఉన్న బాబుక్యాంపు, సిద్ధార్ధనగర్ వాసులు కొంతమంది తమ ఇళ్లలోని చెత్తచెదారాన్ని తీసుకువచ్చి రిజర్వాయర్లో పడేస్తుడడంతో చెరువులోని నీరు కలుషితం అవుతోందని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్శాఖ అధికారులు స్పందించి చెరువులో చెత్తచెదారం వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కొటేషన్ల ఆహ్వానం
హన్మకొండ అర్బన్ : ప్రగతినగర్లోని శ్రీ వెంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అవసరమైన వివిధ సామగ్రి సరఫరా కోసం కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జె. లక్ష్మీనర్సమ్మ శనివారం తెలిపారు. పత్రాలను మే 24 ఉదయం 10 గంటల నుంచి మే 27 మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యాలయ సమయాల్లో పొందవచ్చని పేర్కొన్నారు. పూర్తి చేసిన కొటేషన్లు సీల్ కవర్లో మే 28 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలు ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అభినందన
నయీంనగర్ : ఎల్ఐసీ ప్రీమియంలో మొదటి స్థానం సాధించిన డీఓ రవికుమార్ను పలువురు శనివారం అభినందించారు. భారతీయ జీవిత బీమా సంస్థ వరంగల్ డివిజన్ ఆఫీస్ పరిధిలోని హనుమకొండ బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె.రవికుమార్ సౌత్ సెంట్రల్ జోన్ (ఏపీ, తెలంగాణ, కర్ణాటక) సీఈఓ సమ్మిట్ లెవల్–4 కాంపిటీషన్లో మొదటి సంవత్సర ప్రీమియం మొత్తం రూ.156.98 లక్షల వ్యాపారం చేసి మొదటి వంద మంది డెవలప్మెంట్ ఆఫీసర్లలో మొదటి స్థానం గెలుచుకొని ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హనుమకొండ బ్రాంచ్ మేనేజర్ అంబేడ్కర్, అసిస్టెంట్ మేనేజర్ అరుణ్ మిత్ర, బ్రాంచ్ సిబ్బంది, ఏజెంట్ల సమక్షంలో రవికుమార్ను అభినందించారు.
నియామకం
హసన్పర్తి : టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హసన్పర్తికి చెందిన పుల్లా దుర్గారాం నియమితులయ్యారు. శ నివారం టీపీసీసీ రాష్ట్ర చైర్మన్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్కు దుర్గారాం కృతజ్ఞతలు తెలిపారు.
‘మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం కల్పించాలి’
హన్మకొండ : రాష్ట్ర మంత్రి వర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని బంజారా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.వీరన్న నాయక్, అధ్యక్షుడు గుగులోత్ సజ్జన్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఎల్.దాస్య నాయక్ డిమాండ్ చేశారు. బంజారా ప్రజాప్రతినిధికి మంత్రి పదవి కేటాయించి పూర్తి కేబినెట్ హోదా కల్పించాలని వారు ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ పేరుతో ప్రత్యేక ‘సంత్ సేవాలాల్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలన్నారు. ట్రైబల్ సబ్ ప్లాన్ అమలు చేయాలని, 2018 నుంచి పెండింగ్లో ఉన్న రాయితీలు, ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖలో గిరిజన ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు. ఎస్టీ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని, ప్రతి నియోజకవర్గంలో గిరిజనుల కోసం 1,000 ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా కేటాయించాలని వారు కోరారు.
పరామర్శ
హసన్పర్తి : మండలంలోని ఎల్లాపురానికి చెందిన ఎర్ర పద్మ పాముకాటుకు గురై మృతిచెందింది. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకొండ శ్రీనివాస్ శనివారం పరామర్శించారు.


