● నిమిషం ఆలస్యమైతే నోఎంట్రీ
● 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
● హాజరుకానున్న 4,609 మంది అభ్యర్థులు
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 2026–2027లో ప్రవేశాలకుగాను ఈనెల 12న (నేడు) ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్)నిర్వహించబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లా కేంద్రంలో ఏడు, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు ఎక్స్రోడ్లోని (గాయత్రీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ), ఎర్రగట్టుగుట్టలోని ఐయాన్ డిజిటల్, హసన్పర్తి హైవేలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, గోపాల్పూర్లోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హనుమకొండ వడ్డేపల్లిలోని ఐయాన్ డిజిటల్, వరంగల్ జిల్లా నర్సంపేట లక్నెపల్లి సమీపంలోని బాలాజీ ఇన్స్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీఎడ్సెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి సోమవారం తెలిపారు. టీజీఎడ్సెట్ను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్కు 8: 30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదు. రెండోసెషన్లో మధ్యాహ్నం 12: 30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండు గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుతించబోరు. మొదటి సెషన్లో 2,304 మంది, రెండో సెషన్లో 2,305 మంది మొత్తం 4,609 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. హాల్టికెట్, బ్లూలేదా బ్లాక్ పాయింట్ పెన్, ఐడీ ప్రూప్ తీసుకుని రావాలని వెంకట్రామ్రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.


