● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్ డీఈఐఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సులో 3,263 మంది, ఒకేషనల్ కోర్సులో 329 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 2,083 మంది, ఒకేషనల్ కోర్సులో 182 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9240205555 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.


