కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 రోజుల నుంచి సీటీ స్కాన్ యంత్రం పనిచేయట్లేదు. దీంతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సిటీ స్కాన్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా మారుతోంది. వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు సీటీ స్కాన్ ఎక్కడ చేయించుకోవాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. దీంతో రోగులు ఎంజీఎం ఆస్పత్రి బాట పడుతున్నారు. మండుటెండలో సీటీ స్కాన్ కోసం పేషెంట్తో పాటు అటెండెంట్ ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్తుండడంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు.
అధిక భారం..
ప్రస్తుతం ఎంజీఎంలోని పేషెంట్లకే సీటీ స్కాన్ పరీక్షలు చేయడంలో క్యూ లైన్ పాటించాల్సి వస్తోంది. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా సిటీ స్కాన్ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. చివరకు సిటీ స్కాన్లు అధికంగా తీయాల్సి రావడంతో ఇక్కడి స్కాన్ పరికరం కూడా పనిచేయకుండా మూలన పడే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. కాగా, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని పరికరానికి సంబంధించిన వారెంట్ ముగియడంతో సంబంధిత టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావట్లేదని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి రావాల్సిన బకాయిలు ఉండడంతో వారు రావట్లేదని సమాచారం. దీంతో స్కాన్ పరీక్షల కోసం ఇంకెన్ని రోజులు పడతాయో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి నట్లు అధికారులు చెబుతున్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలో
రోగులకు ఇక్కట్లు


