ఖిలా వరంగల్: సౌర విద్యుత్పై రైతులకు అవగాహన ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తూర్పుకోటలో వ్యవసాయ, రెవెన్యూ, టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ పంప్సెట్లకు సౌర విద్యుత్ వినియోగిస్తే పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల సమీపంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. పీఎం కుసుం పథకాలపై వివరించారు. అనంతరం రైతులు, వినియోగదారుల కోసం రూపొందించిన విద్యుత్ భద్రత అవగాహన పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ, శాస్త్రవేత్తలు శ్రావణ్, హరి, ఏఓ విజ్ఞాన్, సాగుకు సంబంధించిన పలు కీలక అంశాలను రైతులకు వివరించారు. విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్, తహసీల్దార్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్ సువర్ణ, రెడ్కో జనరల్ మేనేజర్ రాజేందర్, ఎస్ఈ ఆనందం, ఏడీఈ కిశోర్, ఏఈ రామకృష్ణ, చంద్రకాంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వీరేశ్బాబు, రైతులు పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను విజయవంతం చేయాలి..
న్యూశాయంపేట: జిల్లాలో వేసవి శిబిరాల విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శిబిరాల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 10 వరకు నిర్వహించనున్న శిబిరాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ నాగపద్మజ, అదనపు డీఆర్డీఓ రేణుక, డీపీఓ కల్పన, సంక్షేమాధికారి రాజమణి తదితరులు పాల్గొన్నారు.
జాబ్మేళా ఏర్పాట్ల పరిశీలన..
హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా జాబ్మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు కంపెనీలు రానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నిరుద్యోగ యువత వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు ఉన్నారు.
నేడు కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళా
వరంగల్ స్పోర్ట్స్: యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం)బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈజాబ్ మేళాలో ప్రైవేట్ రంగానికి చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మార్కెటింగ్, సేల్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ తదితర రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద


