కేయూ క్యాంపస్: ‘వరంగల్ జిల్లాను ఎవరు అభివృద్ధి చేశారు? ఎంత అభివృద్ధి చేశారనే చర్చకు రా..’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన నీచ చరిత్ర బీఆర్ఎస్దే అని, దొంగ మాటలు, దొంగ కన్నీళ్లు కారుస్తూ రైతు సదస్సు నిర్వహించారన్నారు. సదస్సులో రైతులు అంతంత మాత్రంగా ఉన్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ ఉన్నారని ఆరోపించారు. రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రైతులకు బేడీలు వేసి కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. ఏనుమాముల మార్కెట్లో నాడు బీఆర్ఎస్ నేతలను రైతులు తరిమికొట్టారని గుర్తుచేశారు. పదేళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొకపోతే తరిమికొడతామన్నారు. బీఆర్ఎస్ అంటే బద్మాష్ రాష్ట్ర సమితి అని ఎద్దేవాచేశారు. సమావేశంలో రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కేటీఆర్కు సవాల్ విసిరిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి


